GHMC | సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను వసూళ్లపై పార్లమెంట్ ఎన్నికల కోడ్ ప్రభావం చూపనున్నది. ఇప్పటికే గతేడాది అసెంబ్లీ ఎన్నికలు, కొత్త సర్కారులో ప్రజాపాలన సందర్భంగా అధికారులు సంబంధిత విధుల్లో నిమగ్నం కావడంతో ఆస్తిపన్ను కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ నేపథ్యంలోనే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2100 కోట్ల నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం రూ. 1488.47 కోట్లు మాత్రమే వసూలైంది.
రాబోయే 13 రోజుల్లో ఆర్థిక సంవత్సరం గడువు ముగుస్తుండటం.. 70.88 శాతం మాత్రమే వసూలు కావడం..అందులో పార్లమెంట్ ఎన్నికల విధుల్లో చాలా మంది అధికారులు, సిబ్బంది ఉండటంతో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించడం జీహెచ్ఎంసీకి కతి ్తమీద సాములా మారిందనే చెప్పవచ్చు.
వాస్తవంగా ఈ నెల మొదటి వారంలోనే ఆస్తిపన్ను బకాయిదారులపై బల్దియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. బకాయిలపై 90శాతం వడ్డీ రాయితీ అందిస్తూ వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటీఎస్ ద్వారా దాదాపు రూ.500 కోట్ల మేర ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా వేశారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. 18 రోజుల్లో రూ.55 కోట్ల మేర మాత్రమే ఓటీఎస్ కలెక్షన్లు వచ్చాయి.
ఆస్తిపన్ను వసూళ్లలో వేగం పెంచడం, ఓటీఎస్, ప్రతి ఆదివారం ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార వేదికల నిర్వహణ పర్యవేక్షణకు సర్కిల్ వారీగా ఐఏఎస్ల నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రత్యేక అధికారులుగా నియమించినప్పటికీ ఫలితాలు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి. ఈ సమయంలోనే ఈ నెలలో రూ.685.85కోట్ల టార్గెట్లో కేవలం రూ. 76కోట్ల మేర మాత్రమే వసూలయ్యాయి. రాబోయే 13 రోజుల్లో 22 శాతం వసూళ్లను రాబట్టడం, అందులో ఎన్నికల విధులు, వరుస సెలవులు వస్తుండడం అధికారులకు సవాల్గా మారింది. మొత్తంగా ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యం అధిగమించడం కష్ట సాధ్యమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.