ఎల్బీనగర్, ఫిబ్రవరి 24: ఎల్బీనగర్ జోన్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో కుక్కల బెడదపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ తెలిపారు. శుక్రవారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో కుక్కల బెడద, కుక్క కాటు నుంచి ప్రజల సంరక్షణపై ఎల్బీనగర్ జోన్లోని ఐదు సర్కిళ్ల ఉప కమిషనర్లు, వెటర్నరీ, పారిశుధ్య విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ పంకజ మాట్లాడుతూ అంబర్పేట సంఘటన నేపథ్యంలో ఎల్బీనగర్ జోన్లో కుక్కలను పట్టే వారిని, వాహనాలను పెంచాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం సర్కిల్కు ఒక వాహనం, ఐదుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, వాహనాలు, సిబ్బందిని పెంచి రాత్రి సమయంలోనూ వీధి కుక్కల నుంచి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చేసేందుకు వాహనాలు, సిబ్బంది తిరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మూసీ నది పరీవాహక ప్రాంతంలోని కాలనీల్లోని వీధి కుక్కలను పట్టుకుని వాటికి కుంటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలని నిర్ణయించడంతో పాటుగా మూసీ పరీవాహక ప్రాంతాల్లోని కాలనీల్లో కుక్కలను పట్టుకునేందుకు రెండు టీంలను స్పెషల్గా ఏర్పాటు చేస్తున్నామన్నారు. హోటల్స్, హాస్టల్స్, ఫంక్షన్హాల్, నాన్ వెజిటేరియన్ షాపుల వారు వ్యర్థాలను రోడ్డుపై పడవేయకుండా పారిశుధ్య ట్రాలీలకే అందజేయాలని ఆదేశాలు ఉన్నాయని, వాటిని అమలు చేసేందుకు సర్కిల్ వారీగా ఒక ఎన్ఫోర్స్మెంట్ టీంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఎల్బీనగర్ జోన్ వెటర్నరీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ రణజిత్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు గైడ్లైన్ ప్రకారం కుక్కలను పట్టుకుని వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి తిరిగి అదే ప్రాంతంలో వదిలివేయాల్సి ఉంటుందన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, సదస్సులు పెట్టాలని నిర్ణయించామన్నారు. కాల్ సెంటర్ నంబర్ 040 21111111కు కుక్కకాటు జరిగిన ప్రాంతం నుంచి సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో, ఉప కమిషనర్లు మారుతీ దివాకర్, సురేందర్రెడ్డి, హరి కృష్ణయ్య, శంకర్, అరుణకుమారి, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రణజిత్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ జేవ్యా నాయక్,డాక్టర్ యాదగిరి, సర్కిల్స్ వారీగా ఎఎంఓహెచ్లు స్వప్నారెడ్డి, చందన, వెంకటేశ్, నీలిమ తదితరులు పాల్గొన్నారు.