హైదరాబాద్ : కేంద్రమంత్రిగా సికింద్రాబాద్(Secunderabad) పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డిని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్(Padmarao Goud) ప్రశ్నించారు. సోమవారం ఆయ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల ఎన్నికల ఇంచార్జీలు వెంకట్ రెడ్డి, మేడే రాజీవ్ సాగర్, సనత్ నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మీబాల్ రెడ్డిలతో కలిసి సనత్నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
దారిపొడవునా ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాలు, పూలమాలలతో స్వాగతం పలికారు. సనత్ నగర్ బస్టాండ్ వద్ద పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో బీఆర్ఎస్(BRS) పార్టీకి బ్రహ్మరథం పట్టారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి ఏనాడు నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.