Hyderabad Metro | సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ఎండలు మండుతున్నాయి. బస్సెక్కుదామంటే..బస్ కోసం ఎదురు చూడాలి. బస్లో రష్..అమ్మో ఉక్కపోత..సగటు సామాన్యుడి ఆవేదన. అర్జెంట్ అయితే ..ఏ ఆటోలోనే వెళ్తే..వామ్మో వడగాలి భయం..ఓ వ్యాపారి ఆందోళన..క్యాబ్లో వెళ్దామంటే..అమ్మో ఛార్జీల కుమ్ముడు…ఓ ఉద్యోగి భయం వెరసి సామాన్యుడి మొదలుకుని ప్రతి ఒక్కరికీ మెట్రో రైళ్లు శరణ్యమవుతున్నాయి. మండుతున్న ఎండలతో కూల్కూల్గా ప్రయాణం చేయవచ్చని చాలామంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా గత కొద్దిరోజులుగా మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద విపరీతమైన రద్దీ కనబడుతున్నది. అంచనాలకు మించి ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. కొవిడ్ తర్వాత మళ్లీ మెట్రో రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ తీవ్రత కనబడుతుండగా..ప్రస్తుత వేసవిలో ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటున్నది.
నగరంలో 69కి.మీ.ల మేర ఉన్న మెట్రో లైన్ పరిధిలో 57 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోలు- రాయదుర్గం కారిడార్ల పరిధిలో నిత్యం వెయ్యి సర్వీసులను నడుపుతున్నారు. ముఖ్యంగా 29కి.మీ.ల మధ్య దూరం ఉన్న ఎల్బీనగర్-మియాపూర్, నాగోలు- రాయదుర్గం కారిడార్లలోనే రద్దీ ఎక్కువగా ఉంటున్నది. ప్రస్తుత వేసవిలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరువవుతుండడంతో ఎండ తీవ్రతను తట్టుకోలేక అన్నివర్గాల ప్రజలు మెట్రో రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అన్ని వేళల్లోనూ స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. మెట్రో కోచ్ల్లోనైతే కాలు తీసి పెట్టలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెల 17న 4.44 లక్షల మంది, 18న 4.51లక్షల మంది, 19న 4.24 లక్షల మంది రాకపోకలు సాగించినట్లు మెట్రో వర్గాలు వివరాలను వెల్లడించాయి. గురువారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 5 లక్షలకు చేరువవుతుందని అంచనా. మూడు కారిడార్ల పరిధిలో ప్రతి నిత్యం 4-5 నిమిషాలకు ఒక రైలును నడిపిస్తున్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. రద్దీ తీవ్రత కారణంగా అదనపు కోచ్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. మెట్రో రైళ్లకు పెరుగుతున్న ప్రయాణికుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని రైళ్లకు అదనపు కోచ్లు ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలని సోషల్ మీడియా వేదికగా ఎల్అండ్టీ అధికారులకు వినతులు వెల్లువెత్తుతున్నాయి.
సోమవారం : 4.44 లక్షల మంది
మంగళవారం : 4.51లక్షల మంది
బుధవారం : 4.24 లక్షల మంది