గతవైభవాన్ని సైతం విద్యార్థులకు చాటిచెప్పేలా చర్యలు
ఈ ఏడాది నుంచి ప్రతీ ఏటా ఘనంగా వ్యవస్థాపక దినోత్సవం
విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్
ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 25: ఉస్మానియా యూనివర్సిటీ పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి. రవీందర్ పిలుపునిచ్చారు. వర్సిటీ గత వైభవాన్ని ప్రస్తుత తరం విద్యార్థులకు చాటిచెప్పేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వర్సిటీ ప్రారంభించిన రోజును పురస్కరించుకుని వ్యవస్థాపక దినోత్సవాన్ని గత 104 ఏండ్లలో ఎప్పుడూ నిర్వహించలేదని (శతాబ్ధి ఉత్సవాలు మినహా) గుర్తు చేశారు. ఇప్పటి నుంచి ప్రతీ ఏడాది వర్సిటీని ప్రారంభించిన ఏప్రిల్ 26న ఘనంగా ఓయూ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. కేవలం ఉర్దూ బోధనా భాషగా కొన్ని కోర్సులతో ప్రారంభించిన వర్సిటీ అంచలంచెలుగా ఎదుగుతూ వివిధ భాషలు, విభాగాలతో అలరారుతున్నదని పేర్కొన్నారు.
ప్రస్తుతం వర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు యూనివర్సిటీ ప్రారంభించేనాడు ఉన్న పరిస్థితులు, నిజాం ఫర్మానా, కాలక్రమంలో ఇక్కడ జరిగిన ఉద్యమాలు, ఓయూ నుంచి ఎదిగిన రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణుల గురించి తెలియజెప్పేందుకే వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. అదేవిధంగా ప్రతీ రెండు నెలలకు ఒకసారి ప్రముఖుల ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వర్సిటీ ప్రారంభించి 104 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు ఠాగూర్ ఆడిటోరియంలో వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రముఖుల కీలకోపన్యాసాలు..
వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, వ్యవస్థాపక దినోత్సవ కీలకోపన్యాసకులుగా లోక్పాల్ కార్యదర్శి భరత్లాల్, గౌరవ అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా హాజరవుతారని వీసీ వివరించారు. ‘వాటర్ సెక్యూరిటీ టు సస్టెయిన్ ఎకానమిక్ గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ’అనే అంశంపై భరత్లాల్ కీలకోపన్యాసం వెలువరిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, డెవలప్మెంట్ అండ్ యూజీసీ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గణేశ్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాములు, ఐక్యూఏసీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ నవీన్కుమార్, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు, ఫిజికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. సత్యనారాయణ, స్టూడెంట్ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ రాజేందర్ నాయక్, పీఆర్వో డాక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఓయూలో ఘనంగా 2కే వాక్, రన్
ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 25: ఉస్మానియా యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందుగా 2కే రన్, వాక్ నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్సీసీ గేటు వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాలను ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ జెండా ఊపి ప్రారంభించారు. రన్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఓయూ అధికారులు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.