సుల్తాన్బజార్, డిసెంబర్ 27: కొవిడ్-19 జేఎన్-1 వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉస్మానియా దవాఖానలో అవసరమైన అన్ని వసతులను సిద్ధంగా ఉంచామని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ తెలిపారు. బుధవారం ఆయన తన చాంబర్లో ఆర్ఎంవోలు, సంబంధిత శాఖల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, హెల్త్ ఇన్స్పెక్టర్లతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిత్యం పెరుగుతున్న కొవిడ్ పాజిటివ్ కేసులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైద్యాధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. దవాఖానలో కొవిడ్-19 పరిస్థితిని సమన్వయం చేయడానికి జనరల్ మెడిసిన్ విభాగం నుంచి నోడల్ అధికారిని నియమిస్తామన్నారు. దవాఖానకు వైద్యం కోసం వచ్చే రోగులు, దవాఖానలో ఇన్ పేషెంట్లుగా ఉన్న రోగులు, రోగి సహాయకులు, దవాఖాన సిబ్బంది తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ఆర్ఎంవోలను ఆదేశించారు. కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజలు భయాందోళన చెందవద్దన్నారు. దవాఖానలో కొవిడ్ బారిన పడిన వారికి ప్రత్యేకంగా ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆ వార్డులో ముగ్గురు ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారని తెలిపారు. దవాఖానలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించిన అనంతరం కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం విధితమే. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉస్మానియా పాలకవర్గం పటిష్ట చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సీఎస్ ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, డిప్యూటీ సీఎస్ ఆర్ఎంవోలు డాక్టర్ సాయిశోభ, డాక్టర్ బండారి శ్రీనివాసులు, ఆర్ఎంవోలు డాక్టర్ కవిత, డాక్టర్ సిద్దిఖీ, డాక్టర్ అనురాధ, డాక్టర్ ఎండీ రఫీ, డాక్టర్ విజయభాస్కర్, హెల్త్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి ; కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్
వైద్యం కోసం వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఐఏఎస్ ఆర్వీ కర్ణన్ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి ఉస్మానియా దవాఖానను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్తో కలిసి దవాఖానలోని ఓపీ బ్లాక్లోని రిజిస్ట్రేషన్ కౌంటర్, క్యూడీసీ బ్లాక్లోని వార్డులతో పాటు ల్యాబ్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దవాఖానకు వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సీఎస్ ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రి, డిప్యూటీ సీఎస్ ఆర్ఎంవోలు డాక్టర్ సాయిశోభ, డాక్టర్ బండారి శ్రీని వాసులు, ఆర్ఎంవోలు డాక్టర్ ఎండీ రఫీ, డాక్టర్ కవిత, డాక్టర్ సిద్ధిఖీ, డాక్టర్ విజయ భాస్కర్ పాల్గొన్నారు.