ఔటర్పై పెరగనున్న టోల్ చార్జీలు
ప్రతి కిలోమీటర్కు రూ.6 పైసల నుంచి రూ. 39 పైసల వరకు..
పెరిగిన ధరలు నేటి నుంచి అమలు
నేటినుంచే అమల్లోకి..!
3.5శాతం మేర పెంచుతూ ఉత్తర్వులు
సిటీబ్యూరో, మార్చి 31 : ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ చార్జీలు పెరిగాయి. గతేడాదితో పోల్చితే ఒక్కో వాహనంపై సరాసరిగా 3.5శాతం మేర పెంచుతూ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ విభాగం (హెచ్జీసీఎల్) అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన దారిసుంకం పెంచేందుకు వీలుంటుంది. ఇందులో భాగంగానే 2022-23 సంవత్సరానిగాను వాహనాలను ఆరు కేటగిరీలుగా విభజించి దారి సుంకాన్ని పెంచారు. తాజా పెంపుదలతో ప్రతి కిలోమీటర్కు 6పైసల నుంచి 39 పైసల వరకు టోల్ చార్జీ పెరగనున్నది. పెరిగిన ఈ ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి రానున్నాయి. కాగా ఔటర్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈగల్ ఇన్ఫ్రా సంస్థ ఏడాదికి రూ.415కోట్ల మేర హెచ్ఎండీఏకు చెల్లించనున్నది.
భారీగా పెరిగిన రాకపోకలు
ఔటర్ రింగు రోడ్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న హెచ్జీసీఎల్కు జీవో నం.365 క్లాజ్ 5ప్రకారం నెహ్రూ ఔటర్ రింగు రోడ్డు టోల్ రూల్స్-2012 ప్రకారం ఏటా కొంత మేర టోల్ చార్జీలు పెంచేందుకు అవకాశం ఉంది. మహానగరం చుట్టూ 158కి.మీ మేర నిర్మించిన ఓఆర్ఆర్పై రోజుకు 1.30 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. టూ టైర్, త్రీ టైర్ వాహనాలు మినహా అన్ని రకాల వాహనాలు ఓఆర్ఆర్పై రాకపోకలు సాగించవచ్చు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఓఆర్ఆర్పై రాకపోకలు భారీగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వాహనాల రద్దీకి అనుగుణంగా ఓఆర్ఆర్ చుట్టూ హెచ్ఎండీఏ వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నది. ముఖ్యంగా వాహనదారులకు ఆహ్లాదం కలిగించేలా ఓఆర్ఆర్కి ఇరువైపులా, మధ్యలో లక్షలాది మొకలు నాటింది. వీటి నిర్వహణకే ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది.