వచ్చే నెలలో అందుబాటులోకి రానున్న నార్సింగి ఇంటర్చేంజ్
కోకాపేటలోనూ ముమ్మరంగా పనులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్లో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఔటర్ రింగు రోడ్డు చుట్టు పక్కల ప్రాంతాల్లో రోడ్ల విస్తరణపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దృష్టి సారించింది. గచ్చిబౌలి నుంచి నార్సింగి, కోకాపేట వరకు ఓఆర్ఆర్ ప్రధాన రహదారి (మెయిన్ క్యారేజ్వే), సర్వీసు రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా పెరగడంతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నార్సింగి ఇంటర్చేంజ్ వద్ద చేపట్టిన పనులు వేగంగా జరుగుతున్నాయి. మెహిదీపట్నం- శంకర్పల్లి ప్రధాన రహదారిపై ఉన్న నార్సింగి వద్ద ఔటర్ రింగు రోడ్డుపైకి వెళ్లేందుకు, దిగేందుకు ర్యాంపులు లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో గత ఏడాది హెచ్ఎండీఏ అధికారులు నార్సింగి ఇంటర్చేంజ్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులు జరుగుతున్నాయి. నార్సింగి ఇంటర్చేంజ్ నిర్మాణంతో ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి. కోకాపేట వద్ద మరో ఇంటర్ చేంజ్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి.
నార్సింగి ఇంటర్చేంజ్.. వచ్చే నెలలో ప్రారంభం..
గత ఫిబ్రవరిలోనే నార్సింగి ఇంటర్చేంజ్ పనులను పూర్తి చేసి, వాహనాల రాకపోకలకు అనుమతించాల్సి ఉంది. అయితే, క్షేత్ర స్థాయిలో పనుల నిర్వహణలో పలు అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రధానంగా నార్సింగి ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వద్ద మూసీ నది ఉండటంతో అక్కడ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయారు. సుమారు రూ.65 కోట్లతో నార్సింగి ఇంటర్చేంజ్తో పాటు కోకాపేట నియోపోలిస్ ట్రంపెట్ నిర్మాణ పనులను హెచ్ఎండీఏ చేపట్టింది. పనులు పూర్తయిన వెంటనే తొలుత నార్సింగి ఇంటర్చేంజ్ను అందుబాటులోకి తీసుకువచ్చి, ఆ తర్వాత కోకాపేట నియోపోలిస్ ఓఆర్ఆర్ ట్రంపెట్ నిర్మాణ పనులను జూన్- జూలై నాటికి పూర్తి చేసే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు.