సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం అందించడంలో సైబరాబాద్ పోలీసులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ నెల 20న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన 2,232 సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు అనుకూలంగా కోర్టుల నుంచి రీఫం డ్ ఆదేశాలు పొందడంలో విజయాన్ని సాధించారు.
ఈ ఆదేశాల ద్వారా మొత్తం రూ.21.90 కోట్ల నగదు బాధితులకు తిరిగి అందేలా మార్గం సుగమమైంది. వివరాల్లోకి వెళితే… సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 24 పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను లోక్ అదాలత్లో ప్రవేశపెట్టి బాధితుల తరఫున రీఫండ్ పిటిషన్లు దాఖలు చేయగా, న్యాయస్థానాలు సానుకూలంగా స్పందించాయి. కోర్టుల ఆదేశాల మేరకు అవసరమైన ప్రక్రియ పూర్తయిన అనంతరం సంబంధిత బ్యాంకులు బాధితుల ఖాతాల్లో నగదును జమ చేసేందుకు అంగీకరించాయి.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్తో పాటు ఈ ప్రక్రియలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) డైరెక్టర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖాగోయల్ ప్రత్యేకంగా అభినందించారు. సైబర్ నేరాల బాధితులకు ఆర్థిక ఉపశమనం కల్పించడంలో సైబరాబాద్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయమన్నారు.