సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సర్కిల్ పరిధిలోని పోస్టల్ శాఖలో పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 7 శాతానికి తగ్గకుండా పెంచినట్లు ఆ శాఖ అధికారులు శనివారం హైదరాబాద్ రీజియన్ జనరల్ పోస్టుమాస్టర్ తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచే ఆయా పథకాలపై వడ్డీని చెల్లించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఖాతాలు తెరిచేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్తో పాటు మరో 40 పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. వినియోగదారుల వద్దకే వెళ్లి వారి వివరాలతో ఖాతాను తెరువనున్నట్లు, మరుసటి రోజే ఖాతాబుక్ను ఇవ్వనున్నట్లు తెలిపారు. www.indiapost.gov.in \http: //www. indiapost.gov. in దీంతో పాటు టోల్ఫ్రీ నంబర్ 1800-266-6868లో కూడా సంప్రదించవచ్చని సూచించారు.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)-8శాతం వడ్డీ, సుకన్య సమృద్ధి యోజనా ఖాతా- 7.6 వడ్డీ, కిసాన్ వికాస్ పత్ర-7.2, నెల ఆదాయ పథం-7.1, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-7.1, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్-7శాతం వడ్డీలను అందిస్తున్నట్లు పోస్టల్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇవేకాకుండా టైం డిపాజిట్ (1, 2,3, 5 ఏండ్ల టెర్మ్ డిపాజిట్) 1 సంవత్సరానికి-6.6 శాతం వడ్డీ, రెండేండ్లకు-6.8శాతం, మూడేండ్లకు-6.9 శాతం, 5 ఏండ్లకు 7.0 శాతంగా నిర్ణయించారు. రికరింగ్ డిపాజిట్ పథకానికి 5.8 శాతం వడ్డీ, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు 4శాతం వడ్డీని చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ సర్కిల్ పరిధిలో ఇప్పటికే 8లక్షల 41వేల 109ఖాతాలు కలిగి ఉన్నట్లు చెప్పారు. ఫిబ్రవరి, మార్చిలో 50వేల ఆన్లైన్ ఖాతాలు తెరిచేవిధంగా పోస్టల్ సిబ్బంది కృషి చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాకింగ్తో పాటు అన్ని పథకాలకు సంబంధించి ఖాతాదారులకు ఆన్లైన్ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.