Hyderabad | సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు ప్రభుత్వం అందించే మౌలిక వసతుల్లో విద్యుత్ సరఫరా అత్యంత కీలకమైంది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా అవసరమ్యేది విద్యుత్ కనెక్షన్. విద్యుత్ కనెక్షన్ ఉంటేనే బోర్వెల్ నడుస్తుంది. ఆ తర్వాతే ఇంటి నిర్మాణం సాఫీగా జరుగుతుంది. ఇలా ఎంతో కీలకమైన విద్యుత్ అంశం విషయంలో కాలనీలు, లేఅవుట్లలో సరైన స్థలాన్ని కేటాయించకపోవడంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్, పార్కులు.. ఇలా రకరకాల మౌలిక వసతుల కల్పన ప్రజల దైనందిన జీవనంలో చాలా అవసరం. మెరుగైన రీతిలో మౌలిక వసతులు కల్పించాలంటే అందుకనుగుణంగా స్థలాలు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేటషన్ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) నిబంధనల ప్రకారం కొత్తగా అభివృద్ధి చేసే లేఅవుట్లో 30శాతం రోడ్లు, 10శాతం ఇతర మౌలిక వసతుల కోసం కేటాయిస్తున్నా, విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉండడం లేదు.
ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు స్థల కొరత
నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలన్నా, సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నా స్థలాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. లేఅవుట్లు అభివృద్ధి చేస్తున్న బిల్డర్లు కేవలం విద్యుత్ తీగలతో స్తంభాలను, రోడ్డును అనుకొని ఫుట్పాత్పైనే ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఇళ్ల నిర్మాణం జరుగుతుండటంతో విద్యుత్ లైన్లకు, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన స్థలాలను తరచూ మార్చాల్సి వస్తుంది. తమ ఇంటికి ఎదురుగా ట్రాన్స్ఫార్మర్ ఉందని ఒకరు, విద్యుత్ స్తంభం అడ్డుగా ఉందని మరొకరు విద్యుత్ శాఖపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి పరిస్థితి నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ నెలకొంది. మంచినీరు, డ్రైనేజీ లైన్ల కోసం ప్రత్యేకంగా లైన్లు వేసినట్లుగా విద్యుత్ ప్రత్యేకంగా శాశ్వత ప్రాతిపదికన లేఅవుట్లలో స్థలాలను కేటాయిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. దీనిపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధికారులు ఒక ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. గ్రేటర్ చుట్టూ పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వంటి కీలకమైన మౌలిక వసతిని కల్పించాలంటే ప్రత్యేకంగా కొత్తగా అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లలో స్థలాలను కేటాయించేలా నిబంధనలు రూపొందించాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రత్యేకంగా స్థలాలు ఉంటేనే..
కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే ప్లాట్లు, ఇండ్ల యజమానుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నివాస ప్రాంతాల్లో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన్నా, నిర్వహణ పనులు సాఫీగా చేపట్టాలన్నా విద్యుత్ శాఖకు కొంత స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించాల్సిన అవసరం ఉంది. ప్రతి లేఅవుట్లో సుమారు 400 గజాల నుంచి 2000 గజాల వరకు స్థలం ఉంటే ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు సరిపోయేలా సబ్ స్టేషన్తో పాటు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయవచ్చు. ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటే రూ.8 కోట్లు ఖర్చవుతుంది. ప్రతి నెలా వేల సంఖ్యలో కొత్త కనెక్షన్లు ఇవ్వాలంటే విద్యుత్ సరఫరా కోసం అవసరమైన నెట్వర్క్ అందుబాటులో ఉండాలి. డిమాండ్కు అనుగుణంగా కొత్త కనెక్షలు ఇవ్వాలన్నా, అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ను అందించాలన్నా ఆయా ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసేందుకు, విద్యుత్ లైన్ల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలి.
-జె.శ్రీనివాస్ రెడ్డి, ఆపరేషన్స్ డైరెక్టర్,దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ