శంషాబాద్ రూరల్ : ఔటర్రింగ్ రోడ్డుపై ముందుగా వెళ్తున్న ట్యాంకర్ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీ కొనడంతో కారులో ఉన్న వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సత్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం సూర్యపేట జిల్లా నడికుడ మండలం, వేణుగోపాలపురం గ్రామానికి చెందిన గోవర్ధన్ (56) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే అతడి కూతురు హైదరాబాద్ బోరబండలోని గాయిత్రినగర్లో ఉంటుంది. కూతురు వద్దకు కారులో వస్తుండగా శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న ట్యాంకర్ను ఢీకొనడంతో కారులో ఉన్న గోవర్ధన్ అక్కడిక్కడే మృతి చెందారు.
విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్ఠం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.