కందుకూరు, ఫిబ్రవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మంచి ఫలితాలను ఇస్తున్నది. గ్రామ పంచాయతీల వారీగా నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే వాన కాలంలో ప్రారంభం కానున్న హరితహారంలో ప్రతి గ్రామ పంచాయతీలో వన నర్సరీలు ఏర్పాటు చేశారు. ప్రతి పంచాయతీలో 18 వేల మొక్కలు పెంచడానికి నిర్దేశించారు. నర్సరీల్లో 50 రకాల పండ్లు, పూల మొక్కలు పెంచుతున్నారు. అందులో భాగంగా వేప, చింత, బాదం, టేకు, గులాబీ, మందారం, నిమ్మ, దానిమ్మ, జామ, ఉసిరి, గోరింటాకు, మొక్కలతో పాటు ఆ గ్రామానికి ఇంటి పరిసరాల్లో నాటేందుకు కావాల్సిన పూల మొక్కలను కూడా పెంచేందుకు సిద్ధం చేశారు. గ్రామాల్లో పర్యవేక్షణను, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. సంరక్షణకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. మండలంలోని 35 గ్రామ పంచాయితీల్లో మొక్కలను పెంచడానికి అధికారులు, సర్పంచ్లు, పంచాయతీల కార్యదర్శులు కృషి చేస్తున్నారు.
గ్రామ నర్సరీలో 12 వేల మొక్కలను పెంచుతున్నాం. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ద్వారా గ్రామాల్లో పచ్చదనం ఏర్పడుతున్నది. వన నర్సరీలతో పాటు ఒక ఎకరంలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నాం. నాటిన మొక్కలను సంరక్షించడానికి ట్రీ గార్డులను ఏర్పాటు చేస్తున్నాం. పంచాయతీ సిబ్బంది మొక్కలను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నాం.
– సాధ మల్లారెడ్డి, కొత్తగూడ సర్పంచ్
మండల పరిధిలోని 35 గ్రామ పంచాయతీల్లో వన నర్సరీలను ఏర్పాటు చేశాం. వన నర్సరీల బాధ్యతను పంచాయతీల్లోని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు అప్పగించాం. ఉపాధికూలీలు నర్సరీల్లోని మొక్కలను సంరక్షిస్తారు. ఎనిమిదో విడుత హరిత హారం కార్యక్రమానికి మొక్కలను సిద్ధం చేస్తున్నాం.
– రవీందర్రెడ్డి, ఈజీఎస్ ఏపీఎం కందుకూరు