అంధత్వ రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం గ్రేటర్లో గురువారం నుంచి మొదలైంది. అమీర్పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాల్లో మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, శాలిబండ ఏరియా ఆస్పత్రిలో హోం మంత్రి మహమూద్ అలీ, జవహర్నగర్లోని మల్కారంలో మంత్రి మల్లారెడ్డి, జిల్లెలగూడలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, సికింద్రాబాద్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మిగతా చోట్ల ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంటి వెలుగు గొప్ప పథకమని, తెలంగాణ పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయని ఈ సందర్భంగా చెప్పారు. హైదరాబాద్ లిబర్టీ ఏవీ కాలేజీలో కంటి వెలుగు శిబిరాన్ని సీఎస్ శాంతికుమారి తనిఖీ చేశారు.
సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ): పూర్తిస్థాయి అంధత్వ నివారణలో భాగంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రెండో దశ కంటివెలుగు కార్యక్రమం గ్రేటర్ వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. శిబిరంలో ముఖ్యంగా వయస్సు మీదపడిన వృద్ధులు, కంటి జబ్బులున్న వారితో పాటు అన్ని వయస్సుల వారికి కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా అవసరమైన చికిత్స అందిస్తున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 274 కేంద్రాల్లో కంటివెలుగు శిబిరాలు నిర్వహించారు. తొలిరోజు గ్రేటర్ వ్యాప్తంగా 27,152 మందికి కంటి పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అందులో 8,922 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేయగా మరో 4851మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
నగరంలో మొత్తం 155 కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వెల్లడించారు. మొదటి రోజు మొత్తం 11,556 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 3984 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. వీరిలో 40 ఏండ్ల లోపు వారు 449మంది, 40 ఏండ్ల పై బడిన వారు 3535 మంది ఉన్నట్లు వివరించారు. మరో 1890 మంది రోగులకు వారి సమస్య ఆధారంగా ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేశామని, వాటిని వారం పది రోజుల్లో సంబంధిత రోగులకు అందజేస్తామని
డాక్టర్ వెంకటి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం అద్భుతం. అంబర్పేట పటేల్ నగర్ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో గురువారం కంటి పరీక్షలు చేయించుకున్నాను. కంటి అద్దాలు, చుక్కల మందును ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడు నాకు బాగా కనిపిస్తున్నది. సంతోషంగానూ ఉంది. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– బోనం వీరబాబు, బీజేపీ నాయకుడు, అంబర్పేట
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వృద్ధులకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఇంటి సభ్యులు కూడా చేయించని కంటి పరీక్షలను కేసీఆర్ సార్ ఉచితంగా చేయించి అద్దాలను ఇప్పిస్తున్నాడు. ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తూ పేదలను అదుకుంటున్నది. ఇలాంటి మంచి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు.
జిల్లా పరిధిలో మొత్తం 80 కేంద్రాల ద్వారా 558 ప్రాంతాల్లో కంటివెలుగు శిబిరాలు నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా మొత్తం 7894 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, వారిలో 1390 మంది రోగులకు రీడింగ్ అద్దాలు పంపిణీ చేయగా మరో 1890 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేశామన్నారు. వారం పదిరోజుల్లో వీరికి ఇంటి వద్దకే వెళ్లి ప్రిస్క్రిప్షనరీ అద్దాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
జిల్లా పరిధిలో మొత్తం 79 కేంద్రాల ద్వారా 7702 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. వారిలో 3548 మంది రోగులకు రీడింగ్ అద్దాలు పంపిణీ చేశామని, మరో 1374 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. వీరికి 15 రోజుల్లో అద్దాలను వారి ఇంటివద్దకే వెళ్లి అందజేయనున్నట్లు వైద్యాధికారి స్పష్టం చేశారు.