హయత్నగర్, అక్టోబర్ 13: తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ అని హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.జ్యోత్స్నప్రభ తెలిపారు. శుక్రవారం హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోత్స్నప్రభ హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి బతుకమ్మ పండుగ ప్రతీకని కొనియాడారు.
పుష్పాలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి పొర్లే సమయంలో బతుకమ్మ పండుగ వస్తుందన్నారు. భూమి, జలంతో మానవ అనుబంధాన్ని గొప్ప సంబురంగా బతుమ్మ పండుగ జరుపుకొంటారని వివరించారు.
బతుకమ్మ సంబురాల్లో బొడ్డెమ్మ(దుర్గాదేవి)ను బతుకమ్మతోపాటు తయారు చేసి ఆటపాటల అనంతరం నిమజ్జనం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ ఈ.శంకర్నాయక్, డాక్టర్ ధన్రాజ్, డాక్టర్ రాకేశ్ భవాని, డాక్టర్ సురేశ్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జాహెదాబేగం, డాక్టర్ సునీత, డాక్టర్ మంజు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
వనస్థలిపురం, అక్టోబర్ ౧౩: హస్తినాపురంలోని ఓ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు కన్నుల పండువగా జరిగాయి. విద్యార్థినులు బతుకమ్మలు తీసుకువచ్చి, సంప్రదాయం ఉట్టి పడేలా పాటలతో బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూల పండుగ నిర్వహించడం మన గొప్పదనం అన్నారు. అనాదిగా వస్తున్న సంస్కృతిని పరిరక్షించుకుని భవిష్యత్ తరాలకు అందజేయాలన్నారు. ఉత్సవాలు నిర్వహించిన విద్యార్థినులను అభినందించారు.