భాగ్యనగరవాసులు మరోసారి సమైక్యతను చాటారు. అన్నపూర్ణ లాంటి హైదరాబాద్లో వివాదాలతో కాకుండా వివేకంతో వ్యవహరిస్తామని రుజువు చేశారు. క్లిష్ట సమయంలో పరిణతి ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు. ప్రశాంతతే తమకు ముఖ్యమని దేశానికి చాటారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో మూడురోజులు ఉద్రిక్తంగా ఉన్న పాతనగరంలో తిరిగి సాధారణ స్థితి నెలకొన్నది. పాతనగరంలో శుక్రవారం ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఎవరి విధులకు వారు వెళ్లిపోయారు. రాజకీయ నాయకులు, మతపెద్దలు, పోలీసుల సూచనతో సంయమనం పాటించారు. కాగా, పోలీసు ఉన్నతాధికారులు ఓ పక్క అప్రమత్తంగా ఉంటూనే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తోపాటు ప్రత్యేక బలగాలను మోహరించి పర్యవేక్షించారు.
సిటీబ్యూరో/చార్మినార్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): శాంతి భద్రతలే లక్ష్యంగా ప్రభుత్వం అవలంబించిన వ్యూహం. పోలీసు యంత్రాంగం అమలు చేసిన ప్రణాళికతో నగరంలో అలజడి సద్దుమణిగింది. మతోన్మాద శక్తులు చిచ్చుపెట్టేందుకు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజేసిన మత చిచ్చును పోలీసులు కఠిన చర్యలతో ఎక్కడికక్కడే ఆపేశారు. ప్రజల మధ్య వైషమ్యాలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. శుక్రవారం చార్మినార్లోని మక్కామసీద్తో పాటు సౌత్, ఈస్ట్, వెస్ట్జోన్లోని సున్నిత ప్రాంతాల్లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థనలు ముగిశాయి. గురువారం రాజాసింగ్ను పీడీయాక్ట్పై జైలుకు తరలించడంతో ఓల్డ్సిటీలో నిరసనలు పూర్తిగా సద్దుమణిగాయి. అయినా కూడా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా నగరవ్యాప్తంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణం నెలకొనడంతో చార్మినార్ పరిసరాల్లో శుక్రవారం చాలా వరకు వ్యాపారాలు యథావిధిగా నడిచాయి.
అసత్య ప్రచారాలపై నిఘా..
పోలీసులకు సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు. అన్ని పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చాయని వెల్లడించారు. సోషల్మీడియా ద్వారా అసత్య ప్రచారాలు, ప్రజల మధ్య విద్వేషాలు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి.. ఆ పోస్టులను వైరల్ చేసే వారిపై నిఘా ఉంచామని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇదిలాఉండగా సీసీఎస్ సైబర్క్రైమ్లో సోషల్మీడియాలో వైరల్ అయిన రెచ్చగొట్టే పోస్టులను పరిశీలిస్తూ, ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఇలాంటి వారి గత చర్రితను ఆరా తీస్తున్నారు.
రాజాసింగ్ లాయర్పై దాడికి యత్నం
చార్మినార్, ఆగస్ట్ 26: బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్కు అనుకూలంగా నాంపల్లి క్రిమినల్ కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది కరుణాసాగర్పై శుక్రవారం మధ్యాహ్నం హైకోర్టు వద్ద ఆగంతకుడు దాడికి యత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరుణాసాగర్ మధ్యాహ్నం 6వ గేటు నుంచి హైకోర్టులోకి వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆయన కోర్టు గేటులోకి వెళ్లడంతో అతడు పారిపోయాడు. తనపై దాడికి యత్నించినట్లు కరుణాసాగర్ ఫిర్యాదు చేశారని చార్మినార్ ఇన్స్పెక్టర్ గురునాయుడు తెలిపారు. దాడికి యత్నించిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
‘చర్యలు తీసుకోండి’
సుల్తాన్బజార్/శేరిలింగంపల్లి, ఆగస్టు 26: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రషీద్ఖాన్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ.. శుక్రవారం అఫ్జల్గంజ్ ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డికి బీజేపీ గోల్కొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునందన్యాదవ్ తదితరులు ఫిర్యాదు చేశారు. అలాగే రాయదుర్గం పోలీస్స్టేషన్లోనూ కాంగ్రెస్ నేతలైన ఫిరోజ్ఖాన్, రషీద్ఖాన్లపై బీజేవైఎం నాయకులు అమర్నాథ్ యాదవ్ ఫిర్యాదు చేశారు.