మృతుడి కుటుంబీకులకు, మార్చురీ సిబ్బందికి మధ్య వాగ్వాదం
కాంట్రాక్టు సిబ్బందిని తొలగించిన సూపరింటెండెంట్
సుల్తాన్బజార్, మే 31 :మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఉద్యోగిని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ విధుల్లోనుంచి తొలగించారు. మలక్పేట్ శంకర్నగర్కు చెందిన మహ్మద్ మాజిద్(41) ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న చాదర్ఘాట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఉస్మానియా మార్చురీకి తరలించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మృతుడి కుటుంబీకులు మృతదేహాన్ని ఫ్రీజర్లో భద్రపర్చాలని మార్చురీ సిబ్బందిని కోరగా పోలీసుల సమక్షంలోనే వెయ్యి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో మృతుడి కుటుంబీకులకు, మార్చురీ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
ఇదంతా సెల్ఫోన్లో చిత్రీకరించిన మృతుడి కుటుంబీకులు జరిగిన విషయాన్ని దవాఖాన సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేయడంతో పాటు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. వెంటనే స్పందించిన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ త్రివేణి, ఆర్ఎంవో-1 డాక్టర్ శేషాద్రితో కలిసి సిబ్బందిని విచారించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించారు. దవాఖానలోని ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, మార్చురీ, రోగ నిర్ధారణ కేంద్రాల వద్ద రోగుల నుంచి సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉన్నది.