మియాపూర్, ఫిబ్రవరి 13 : ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటుడటంతో ఆస్తి పన్ను వసూళ్లపై అధికారులు సీరియస్గా దృష్టి సారిస్తున్నారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగింపునకు ముందే వంద శాతం పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. అయితే వార్షిక లక్ష్యంలో ఇప్పటికే 90 శాతానికి పైగా లక్ష్యాన్ని చేరుకుని శేరిలింగంపల్లి జోన్ బల్దియాలో తన దూకుడును ప్రదర్శిస్తున్నది. అయినప్పటికీ వంద శాతం పన్ను వసూళ్లను పూర్తి చేయాలని జోన్ స్థాయి అధికారులు సర్కిళ్ల అధికారులను ఆదేశిస్తున్నారు. వీటిపై తరచూ సమీక్షలు నిర్వహిస్తుండటంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది సైతం మరింత వేగం పెంచారు.
ప్రధానంగా ఐటీ పరిశ్రమలకు శేరిలింగంపల్లి జోన్ వేదికగా ఉండటంతో ఆన్లైన్ ద్వారానే సింహభాగం ఆస్తిపన్ను చెల్లింపులు నమోదవుతున్నాయి. మిగిలిన మొత్తాల వసూళ్లను పూర్తి చేసేందుకు సర్కిళ్లలో వార్డు వారీగా బకాయిదారుల జాబితాల ఆధారంగా క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్లను చేపడుతున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికిగాను శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా రూ.393 కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యంగా ఉండగా.. ఇప్పటికే రూ.316 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నారు. మరో 45 రోజుల గడువులోగా రూ.70 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉన్నది.
1.85 లక్షల అసెస్మెంట్లు..
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో కలిపి గృహ, వాణిజ్య విభాగానికి చెందిన 1.85 లక్షల అసెస్మెంట్లున్నాయి. వాటి ద్వారా పన్నుల రూపంలో వార్షికాదాయం రూ.393 కోట్లు. ఇందులో చందానగర్ సర్కిల్ పరిధిలో 71,515 అసెస్మెంట్లు, శేరిలింగంపల్లి సర్కిల్లో 65,287, యూసుఫ్గూడలో 30,258, ఆర్సీపూర్ పటాన్చెరు సర్కిల్ పరిధిలో 18,264 అసెస్మెంట్లున్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్ నుంచి రూ.245 కోట్లకు గాను రూ.200 కోట్లు, చందానగర్ సర్కిల్ పరిధిలో రూ.103 కోట్లకు గాను రూ.79 కోట్లు, యూసుఫ్గూడ సర్కిల్ పరిధిలో రూ.33 కోట్లకు గాను రూ.24.94 కోట్లు, ఆర్సీపూర్ సర్కిల్లో రూ.12 కోట్లకు గాను రూ.10.52 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లు ఇప్పటి వరకు నమోదయ్యాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జోన్ పరిధిలోని నాలుగు సర్కిళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో అదనపు వసూళ్లతో ముందున్నాయి. సర్కిళ్లలో డాకెట్ల వారీగా బకాయిదారుల జాబితాలలో సదరు నివాసాలు, వాణిజ్య సంస్థల వద్దకు వెళ్తున్న సిబ్బంది ఆస్తిపన్ను వసూళ్లను చేపడుతున్నారు. కొందరికి నోటీసులను సైతం జారీ చేస్తున్నారు.
గడువులోగా వంద శాతం లక్ష్యం సాధిస్తాం..
శేరిలింగంపల్లి జోన్లో ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తున్నది. సింహభాగం పన్నులు ఆన్లైన్ ద్వారా వసూళ్లవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జోన్ వ్యాప్తంగా రూ. 393 కోట్ల ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం కాగా.. ఇప్పటికే రూ.315 కోట్లకు పైగా లక్ష్యాన్ని చేరుకున్నాం. మరో 45 రోజుల గడువున్నప్పటికీ ఆలోగానే వంద శాతం వసూళ్ల లక్ష్యాన్ని చేరుకుంటాం. రోజువారీగా ఆస్తిపన్ను వసూళ్ల పురోగతిపై సమీక్షిస్తున్నాం. సర్కిళ్లలో ఏ డాకెట్లో వెనకబడ్డారో గుర్తించి నేరుగా అక్కడి సిబ్బందితో మాట్లాడి వారిని లక్ష్యం సాధించేలా ప్రోత్సహిస్తున్నాం. గృహ, వాణిజ్య నిర్వాహకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఆస్తి పన్నులను చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలి.
– శంకరయ్య, జడ్సీ శేరిలింగంపల్లి జోన్ ట్రేడ్లైసెన్స్ లేకుంటే షాపులు సీజ్