సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నకిలీ డాక్యుమెంట్లతో కొనసాగుతున్న విద్యాసంస్థల ఆట కట్టించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రైవేటు డిగ్రీ కాలేజి అఫిలియేషన్కు లీజు, రెంటల్, సొంత భవనాలకు సంబంధించి ఒరిజినల్ డాక్కుమెంట్లు ఉండాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. నకిలీ డాక్యుమెంట్లు దాఖలు చేసిన యాజమాన్యాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు కాలేజీల అనుమతి రద్దు చేసే యోచనల్లో ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే ఓయూ అఫిలియేషన్ పొందిన ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు కాలేజీకి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లకు బదులుగా ఫేక్ డాక్యుమెంట్లు దాఖలు చేసి అఫిలియేషన్ పొందుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఏయే కాలేజీలు ఫేక్ సర్టిఫికెట్లు దాఖలు చేశాయన్న విషయాలను నిగ్గు తేల్చేందుకు త్వరలోనే కసరత్తు చేయనున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఫేక్ సర్టిఫికెట్లు లేని డిగ్రీ కాలేజీలకు మాత్రమే అఫిలియేషన్లు ఇవ్వడానికి కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కాలేజీల వారీగా అఫిలియేషన్ తనిఖీలు నిర్వహించే అవకాశాలను కూడా పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై ముందస్తుగా ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి, ఫేక్ సర్టిఫికెట్ల సమస్య, నాణ్యమైన విద్యా బోధన, అఫిలియేషన్లు వంటి పలు రకాల అంశంపై చర్చించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్యాదవ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తెలిపారు.