Hyderabad | జూబ్లీహిల్స్, మార్చి13 : రంజాన్ మాసంలో మసీదుల వద్ద మౌలిక వసతుల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మసీదుల పరిసరాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎం ఎస్బీ తదితర శాఖల అధికారులు పనులు చేపట్టారు. సోమవారం నుంచి రంజాన్ ప్రార్థనలు ప్రారంభం కావడంతో అధికారులు ఆయా సమస్యలపై దృష్టి సారించారు. రంజాన్ మాసంలో మసీదుల వద్ద నీటి సమస్యలు రాకుండా వాటర్ ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేస్తున్నామని జలమండలి జీఎం ఎస్.హరిశంకర్ తెలిపారు.
సీవరేజీ సమస్యలు, ఓవర్ ఫ్లో సమస్యలు తలెత్తకుండా మ్యాన్హోల్స్ పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు. గుంతలతో రోడ్డు సమస్యలు లేకుండా ఇప్పటికే ఇన్స్టంట్ రిపేర్ టీమ్లతో రోడ్ల ప్యాచ్వర్క్ పనులు చేపడుతున్నామని ఈఈ రాజ్కుమార్ తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద రహదారుల మరమ్మతులు చేపట్టనున్నామని తెలిపారు. స్ట్రామ్ వాటర్ డ్రైన్లతో ఓవర్ ఫ్లో సమస్యలు తలెత్తకుండా నాలాలు, డ్రైన్ల పూడికతీత పనులు చేపడుతున్నామని తెలిపారు.