అధిక బరువు జీవితాన్ని భారంగా మార్చేస్తున్నది. అనేక మందిని రోగాలపాలు చేస్తున్నది. దేశంలో 39 శాతం గుండెజబ్బులు, మధుమేహ వ్యాధులకు ఊబకాయమే కారణమని తేలింది. దీర్ఘకాలిక వ్యాధులు.. వాటి పర్యవసనాలపై ఐసీఎంఆర్ – ఎన్ఐఎన్ చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
సిటీబ్యూరో, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ) : ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు ఊబకాయానికి కారణమైతున్నట్లుగా ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో అధిక బరువు సమస్య క్రమంగా పెరుగుతుండగా, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు గేట్ వేగా మారిందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
ఐసీఎంఆర్ ఎన్ఐఎన్తోపాటు దేశవ్యాప్తంగా మరో 20కిపైగా సంస్థలు దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావంపై సర్వే చేశాయి. ఇందులో ప్రధానంగా గుండె జబ్బులు, అధిక బరువు, ఆహారపు అలవాట్లను పరిశీలించారు. కాగా బయో మాస్ ఇండెక్స్ ఆధారంగా అధిక బరువు, ఊబకాయాన్ని లెక్కించగా దేశవ్యాప్తంగా ఈ సమస్య క్రమంగా పెరుగుతున్నట్లుగా స్పష్టమైంది. బీఎంఐ 25-30 మధ్య ఉంటే అధిక బరువు, బీఎంఐ 30 దాటితే ఊబకాయంగా పరిగణిస్తుండగా 39 శాతం మంది జనాల్లో ఈ సమస్యలు ఉన్నట్లుగా తేలింది. కాగా 2040 నాటికి అధిక బరువు బాధితుల సంఖ్య రెండింతలు పెరుగుతుందనే పరిశీలనలో వెల్లడైంది.
ఆహారపు అలవాట్లతోపాటు, ఆధునిక జీవనశైలి అధిక బరువుకు కారణం అవుతుంది. శారీరక శ్రమ లేకపోవడం కూడా బరువు పెరగడానికి కారణం. ఇందులో శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నవారిలో 41శాతం ఉండగా, 30శాతం 25-38 మధ్య వయస్సు వారే ఉన్నారని అధ్యయనంలో వెల్లడైంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండేవారిలో 51శాతం మంది, గ్రామాల్లో 36శాతం మంది జనాలు శారీరక వ్యాయానికి దూరంగా ఉన్నట్లుగా సర్వేలో వెల్లడైంది.
అధిక బరువు బాధితుల సంఖ్య గణనీయంగా పెరగడంతోపాటు గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో సంభవించే ప్రతి 3 మరణాల్లో రెండు ఇవే ఉంటున్నాయని తేలింది. ఇందులో 25-38ఏండ్ల లోపు ఊబకాయంపై నిర్లక్ష్యంగా వ్యవహరించి శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉంటున్నట్లుగా తేలింది. కనీసం రోజులో 20-30 నిమిషాల పాటు శారీరక శ్రమతోపాటు ఆహారంలో పోషక విలువలు కలిగిన తాజా కూరగాయలు, సీజనల్ పండ్లను ఆహారం భాగంగా చేర్చుకోవాలని సూచిస్తోంది. దీంతో బరువు అదుపులో ఉండేందుకు దోహదపడుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు.