Old City Metro | హైదరాబాద్లో కొత్తగా పాతబస్తీ వరకు మెట్రోను విస్తరించనున్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు మార్గాల్లో విజయవంతంగా నడుస్తుండగా.. త్వరలోనే పాతబస్తీలోనూ కూతపెట్టనున్నది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు సుమారు 5.5 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టాలని ఎల్అండ్టీ, మున్సిపల్ శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ క్రమంలో పాతబస్తీలో మెట్రో రైలు పనులకు హెచ్ఎంఆర్ఎల్ కసరత్తు ప్రారంభించింది.
ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. నెల రోజుల్లో మెట్రో నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో రైలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. పాతబస్తీలో మెట్రో రైల్ మార్గంలో ఐదు స్టేషన్లు ఉంటాయన్నారు. పాతబస్తీ మార్గంలో 103 మతపరమైన నిర్మాణాలు ఉన్నాయని, నాలుగు మతపరమైన నిర్మాణాల విషయంలో సమస్యలున్నాయన్నారు. త్వరలోనే వాటిని పరిష్కరించడంతో పాటు మతపరమైన నిర్మాణాలను పరిరక్షిస్తామని చెప్పారు.