సిటీబ్యూరో, మార్చి 9(నమస్తే తెలంగాణ): పౌష్టికాహారానికి పట్టణవాసులు దూరమవుతున్నారు. అర్బన్, పెరి అర్బన్ ప్రాంతాల్లో శరీరానికి సరిపడినన్నీ పోషకాలు చేరడం లేదు. పట్టణాలు, నగరవాసుల ఆహార అలవాట్లపై అధ్యయనం చేసిన ఇక్రిసాట్ పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు అవసరమమైన పోషకాలు చేరడం లేదని గుర్తించింది.
హైదరాబాద్ నగరంతోపాటు, శివారు పట్టణ ప్రాంతాల ప్రజల ఆహార అలవాట్లు, ఆహార వైవిధ్యం, మహిళలు, పురుషులు, కౌమార దశలో ఉన్న యువతీయువకులు తీసుకునే పోషకాలను అంచనా వేసేందుకు ఇక్రిసాట్ సంస్థ అధ్యయనం చేసింది. నగరంలోని అఫ్జల్గంజ్, బేగంపేట్, చాంద్రాయణగుట్ట, గగన్పహాడ్, మాదాపూర్, టోలిచౌకీ ప్రాంతాలతోపాటు, శివారులో ఉన్న ఆర్సీపురం, బాచుపల్లి,గౌరారం(తిమ్మాయిగూడ), కేపీహెచ్బీ 7 ఫేజ్, లింగపల్లి, మల్లాపూర్, నాగోల్, పోచారం, ప్రాంతాల్లో జనాల ఆహారపు అలవాట్లను శాంపిల్గా తీసుకొని అధ్యయనం చేసింది.
పాలు, కూరగాయలతోనే సర్దుకుంటున్న మహిళలు
అర్బన్, పెరి అర్బన్ ప్రాంతాల్లో ఉండే వారి ఆహార అలవాట్లను అధ్యయనం చేయగా… ఇందులో మహిళలు తీసుకొనే పోషకాహారంలో పాలు, కూరగాయలు మాత్రమే ఉన్నట్లు తేలింది. మాంసకృత్తులు, సూక్ష్మపోషకాలు నిల్వ ఉండే డ్రై ఫ్రూట్స్, గుడ్లు, మాంసం, ఆకుకూరలు, విటమిన్ ఏ పండ్లు, కూరగాయలు, ఇతర పండ్లను తక్కువగా తీసుకుంటున్నారు. వీటిని ఎక్కువగా తీసుకునేవారిలో పెద్దవారు , కౌమార దశలో ఉన్న యువకులే అధికంగా ఉన్నారు.
అలాగే మహిళలు, యువతులకు సరిపడినంత ఆహారంలో చేరడంలేదని గుర్తించారు. 0 నుంచి 1.2 సగటు స్కోర్గా విభజించి ఆహార అలవాట్లను అధ్యయనం చేశారు. ఇందులో పాల ఉత్పత్తులను తీసుకొనే పురుషుల స్కోర్ 0.9గా ఉండగా.. మహిళలు 0.8గా, బాలబాలికలు వరుసగా 0.8, 0.85గా ఉన్నారు. ఇక పోషకాలు మెండుగా ఉండే కోడిగుడ్లకు చాలా మంది మహిళలు దూరంగా ఉంటున్నారు. కోడిగుడ్లను ఆహారంలో చేర్చుకునే మహిళల స్కోర్ 0.15లోపే ఉండగా, ఇక పురుషులకు 0.25 స్కోర్గా నిర్ధారించారు.
మాంసం, నట్స్ వినియోగంలో ముందు..
కోడి, మేక, చేపలతోపాటు, బాదం, పిస్తా, కాజు లాంటి నట్స్ను తీసుకొనే జాబితాలో పురుషులు, బాలికలు కొంత మహిళల కంటే ముందు ఉండగా… తీసుకునే పరిమాణం కూరగాయలు, పప్పుదినుసుల కంటే తక్కువగానే తింటున్నారు. మాంసం తినే పురుషుల స్కోర్ 0.3 ఉండగా, యువతుల స్కోర్ 0.2గా ఉంది. అలాగే నట్స్ జాబితాలో యువతుల స్కోర్ 0.25 ఉండగా, పురుషుల స్కోర్ 0.18గా ఉంది. ఇందులో మహిళల స్కోర్ 0.12 లోపే ఉందని పరిశోధకులు గుర్తించారు.