మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. లైనులో నిలబడే పని లేకుండా వాట్సాప్లోనే టికెట్ వచ్చేలా హైదరాబాద్ మెట్రో రైలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్లో 8341146468 నంబరుకు మెసేజ్ పంపగానే ఓ లింకు వస్తుంది. ఏ స్టేషన్లో ఎక్కాలో ఏ స్టేషన్లో దిగాలో ఎంత చెల్లించాలో ఆ లింకులో అన్ని వివరాలు ఉంటాయి. యూపీఐ లేదా మరో ఇతర అకౌంట్ నుంచి డబ్బులు చెల్లించగానే మొబైల్కు స్కాన్ కోడ్ వస్తుంది. అది డిజిటల్ టికెట్లా పనిచేస్తుంది. ఈ సౌకర్యాన్ని ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైలు సీఈఓ, ఎండీ కెవీబీ రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులో ఉన్న హైదరాబాద్ మెట్రోలో అదే స్థాయిలో సేవలను అందిస్తున్నారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా వాట్సాప్ ద్వారా మెట్రో ప్రయాణానికి సంబంధించిన టికెట్ను బుకింగ్ చేసుకునే సేవలను సోమవారం ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైలు సీఈఓ, ఎండీ కేవీబీ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవీబీ రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెట్రో ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగానే వాట్సాప్ టికెటింగ్ సదుపాయాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇలాంటి సేవలను ప్రారంభించడం దేశంలో తొలి మెట్రో రైలు సంస్థగా రికార్డు నెలకొల్పిందని చెప్పారు. బిల్ ఈజీ సంస్థ భాగస్వామ్యంతో వాట్సాప్ ద్వారా మెట్రో ప్రయాణికులు టికెట్లను బుకింగ్ చేసుకునేలా సేవలను ప్రారంభించామని తెలిపారు.
హాయ్ చెప్పగానే లింక్.!
మెట్రో ప్రయాణికులు మొదట 8341146468 నంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపితే దానికి వెంటనే మరో సందేశంతో ఒక లింకు వస్తుంది. లింకును ఓపెన్ చేయగానే (https://hyd. billeasy.in) వెబ్సైట్ తెరుచుకొని ప్రయాణం చేసే మార్గాన్ని చూపిస్తుంది. అందులో ఏ మెట్రో స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభించి, ఎక్కడ దిగుతారో నమోదు చేయాలి. ఆ తర్వాత టికెట్ ఒకరి కోసమా, తిరుగు ప్రయాణమా అని అడుగుతుంది. వీటిని ఎంపిక చేసుకున్న తర్వాత టికెట్ కోసం చెల్లించాల్సిన రుసుమును చూపిస్తూ ప్రొసీడ్ బటన్ బ్లూ కలర్ చూపిస్తుంది. దాన్ని నొక్కగానే పే నౌ బటన్ వస్తుంది. అక్కడి నుంచి యూపీఐ, లేదా ఇతర అకౌంట్ల ద్వారా టికెట్ కోసం చెల్లింపులు చేయవచ్చు. టికెట్ కోసం నిర్ణీత చెల్లింపు చేసిన తర్వాత క్యూఆర్ కోడ్తో టికెట్ వస్తుంది. దానిని మెట్రో స్టేషన్లో ఎంట్రీ గేటు వద్ద క్యూఆర్ కోడ్ రీడర్ ముందు చూపితే లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తుంది. ఈవిధంగా అరచేతిలోని స్మార్ట్ఫోన్ ద్వారా మెట్రో రైలు టికెట్లను అత్యంత సులభంగా కొనుగోలు చేసి ప్రయాణం చేయవచ్చు.
దేశంలోనే మొట్ట మొదటిసారిగా..!
బిల్ ఈజీ ఫౌండర్, ఎండీ ఆకాశ్ దిలీప్ పాటిల్ మాట్లాడుతూ దేశంలో రవాణా వ్యవస్థను డిజిటలైజ్ చేయడానికి తమ సంస్థ పలు అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నదని తెలిపారు. వాట్సాప్ ద్వారా దేశంలోనే ఆన్లైన్ టికెట్ను మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థతో కలిసి అందిస్తున్నామని పేర్కొన్నారు.