సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడారు. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని, ఆ రోజు నుంచే నామినేషన్లను స్వీకరిస్తామని వెల్లడించారు. ఈనెల 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, ఉపసంహరణకు 29వ తేదీ చివరి గడువు అని చెప్పారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చని, అభ్యర్థి వెంట మరో నలుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తారని తెలిపారు. అభ్యర్థితో పాటు ఐదుగురు మాత్రమే నామినేషన్కు అనుమతి అని, వంద మీటర్ల దూరంలో వాహనాలను నిలపాలని చెప్పారు.
జిల్లాలో 45.70 లక్షల ఓటర్లు ఉన్నారని, 3986 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కమిషనర్ వెల్లడించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3927 పోలింగ్ కేంద్రాలు, సైబరాబాద్లో 54, రాచకొండ పరిధిలో 5 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 23, 24వ తేదీల్లో సెంట్రల్ అబ్జర్వర్లు నగరానికి వస్తారని తెలిపారు. ఈవీఎం, వీవీ ప్యాట్లపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఎన్నికల నిర్వహణ సిబ్బందికి శిక్షణను ఇచ్చామని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 23,500 మంది సిబ్బందిని నియమించారని, శిక్షణ కార్యక్రమం సందర్భంగా పీవో, ఏపీవోలు 1700 మంది, మైక్రో అబ్జర్వర్లు 120 మంది ఇతర సిబ్బంది రెండు వేల మంది శిక్షణకు హాజరు కాలేదని, వారికి రెండు సార్లు నోటీసులు ఇచ్చామన్నారు. వారిపై త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఇతర చర్యలు తీసుకుంటామని రోనాల్డ్ రాస్ హెచ్చరించారు. జిల్లాలో పట్టుకున్న నగదుకు సంబంధించి జిల్లా గ్రీవెన్స్ కమిటీలో ఆధారాలు అందజేసిన 24 గంటల్లో విడుదల చేస్తున్నామని, ఇప్పటి వరకు 73 కేసులకు గానూ రూ.2.39 కోట్లు విడుదలకు అభ్యర్థించగా, అందులో 70 కేసుల్లో రూ.1.70కోట్లు విడుదల చేశామన్నారు. ఇప్పటి వరకు ఎంసీసీలో మూడు కేసులు నమోదయ్యాయని, కోడ్ ఉల్లంఘన కు పాల్పడిన 265 మంది అరెస్టయ్యారన్నారు. బోగస్ ఓట్లపై దృష్టి పెట్టామని, వీటిపై ఈసీఐకి నివేదిక అందజేశామని రోనాల్డ్ రాస్ తెలిపారు.
ఈ సారి ఓటింగ్ శాతం పెరిగేలా విస్తృతంగా వివిధ స్వీప్ కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రత్యేకించి ఓటర్లు ఓటు వేసేలా చైతన్య పరచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఓటర్లను చైతన్య పరిచేలా రూపొందించిన 10 బెస్ట్ వీడియోలకు అవార్డులు ఇవ్వనున్నట్లు రోనాల్డ్రోస్ ప్రకటించారు. ఓటింగ్ శాతం తగ్గడానికి గల కారణాలు తెలుసుకునేందుకు 75 పోలింగ్ స్టేషన్ పరిధిలో సర్వే చేపట్టామన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ అదనపు కలెక్టర్, సికింద్రాబాద్ ఆర్వో హేమంత్ పాటిల్, అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.
లోక్సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుండటంతో నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తూ హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.
బండ్లగూడ, ఏప్రిల్ 16: పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. మంగళవారం రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 29,28,186 ఓట్లు ఉన్నాయని, మరిన్ని ఓట్లు నమోదైయ్యే అవకాశం ఉందన్నారు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2877 పోలింగ్ కేంద్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.