ఆర్సీపురం, మదీనాగూడలో చేపట్టిన మరమ్మతు పనులే కారణం
కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా బంద్.. మరికొన్ని చోట్ల లో ప్రెషర్తో సరఫరా
సిటీబ్యూరో, ఏప్రిల్ 10 : హైదరాబాద్కు మంచినీటిని సరఫరా చేస్తున్న పటాన్చెరువు నుంచి హైదర్గూడ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు వాటర్ లీకేజీలను అరికట్టేందుకు జలమండలి మరమ్మతు పనులు చేపట్టింది. ఈ పనులు ఆర్సీపురంలోని లక్ష్మీ గార్డెన్, మదీనాగూడలోని సుమన్ కాలేజీ వద్ద సోమవారం ఉదయం 6 నుంచి మరుసటి రోజు మంగళవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
ఈ పనుల కారణంగా పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. బీరంగూడ, అమీన్పూర్, ఆర్సీపురం, దీప్తిశ్రీ నగర్, మదీనాగూడ, గంగారం, చందానగర్, మియాపూర్, కేపీహెచ్బీ కాలనీ, కూకట్పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, బొల్లారం, హైదర్నగర్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు నీటి సరఫరా ఉండదని తెలిపారు. వీటితో పాటు ఎర్రగడ్డ, బంజారాహిల్స్ రిజర్వాయర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో లోప్రెషర్తో నీటి సరఫరా ఉంటుందని తెలిపారు. నీటి సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని జలమండలికి సహకరించాలని కోరారు.