హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులకు రాబోయే 40 సంవత్సరాల పాటు అవసరమైన తాగునీరు అందుబాటులో ఉందని వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్ తెలిపారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో తెలంగాణ ఇన్ఫ్రా 2022 సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఎక్కువగా హైదరాబాద్కు వస్తున్నాయన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేయడంలో భూ సేకరణ పెద్ద సమస్యగా ఉందన్నారు. 2030 నాటికి ప్రపంచంలో పెరుగుతున్న టాప్ 20 నగరాల్లో భారతదేశానికి సంబంధించినవే 17 ఉంటాయని ఆక్స్ఫర్డ్ సంస్థ నివేదికలో తెలిపిందన్నారు. ఇందులో హైదరాబాద్ ఒకటి అన్నారు. హైదరాబాద్ జీడీపీకి 85 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందన్నారు.
సీఐఐ తెలంగాణ ఇన్ ఫ్రా, రియల్ ఎస్టేట్ ప్యానల్ కన్వీనర్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇన్ఫ్రా రంగంలో హైదరాబాద్ నగరం ఆదర్శంగా ఉందన్నారు. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు ఉందని, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైలు, అవసరమైన నీటి సదుపాయం ఉందన్నారు. రోడ్డు వసతి బాగుండటంతో రైళ్లలో కాకుండా రోడ్డు మార్గాన పయనిస్తున్నారని తెలిపారు.
సీఐఐ అధ్యక్షుడు వాగీష్ దీక్షిత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రేరాను ఏర్పాటు చేసి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐఐ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.