పెట్రోవాత!
కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్పై రూ.3.42, డీజిల్పై రూ.3.26, సీఎన్జీ రూ. 2 పెంచింది. దీంతో సిటీలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.88, డీజిల్ ధర రూ. 98.96కి చేరింది. ప్రధాన నగరాల్లో కంటే సిటీలోనే అత్యధికంగా ఉండటం గమనార్హం. పెరిగిన ధరలపై వాహనదారులు మండిపడుతున్నారు. ఇంధన కొరత కారణంగా చాలా మంది బంక్ నిర్వాహకులు ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించి నో స్టాక్ బోర్డులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంధన ధరలు రూ.3పైగా పెరగడంతో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొననున్నట్టు నిపుణులు చెబుతున్నారు. పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ సిటీలో పలు చోట్ల నిరసనలు చేపట్టారు. నిత్యావసర సరుకుల ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఇంధన ధరల పెంపు అదనంగా భారం కానున్నది. ఈ కారణంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలూ పెరిగే అవకాశం ఉందంటున్నారు.
-సిటీబ్యూరో

Petrol Bunk No Stack
బతుకు బండి సాగేనా?
బండి నడిస్తేగానీ పూట గడవని ఫీల్డ్ తమదని క్యాబ్స్, ఆటో సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇంధన ధరలు పెంచి తమ ఉపాధిని మరింత దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపడా ఇంధనం దొరకక బంక్ల ఎదుట క్యూ కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇబ్బందులు చాలవన్నట్టు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. క్యాబ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు పెంచడం సరైనది కాదని అన్నారు. సామాన్యుల బతుకుల గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పారు.
బీఆర్టీయూ నాయకుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. ఇంధన ధరలు పెంచడంలోబీజేపీ ప్రభుత్వం ముందుంటుందని విమర్శించారు. ప్రజల ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేకుండా పెట్రో, డీజిల్ ధరలు పెంచడం సరైంది కాదన్నారు. ఇంధన ధరల పెంపుతో రైడ్ చార్జీలు పెంచాల్సి వస్తుందని అప్పుడు మళ్లీ సామాన్యులపైనే ప్రభావం పడుతుందని చెప్పారు. కాగా, కేవంల వాహనదారులే కాకుండా అపార్ట్మెంట్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు కూడా ఈ భారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యుత్ కోతలు ఉన్న సమయంలో పవర్ బ్యాకప్ కోసం వాడే డీజిల్ జనరేటర్లు ఖర్చు ఇప్పుడు పెరగనుంది. దీనివల్ల ప్లాట్ల యజమానుల మెయింటెనెన్స్ చార్జీలు సైతం పెరగనున్నాయని చెబుతున్నారు. మరోవైపు ఫుడ్ డెలివరీ ఫ్లాట్ఫారమ్లు కూడా ఫ్యూయల్ సర్చార్జ్ పేరుతో అదనపు బాదుడు మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది.
వాహనాలు నడపలేం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచటంతో వాహనాలను అద్దెకు తీసుకోవాలంటేనే ప్రజలు ముందుకు రావటంలేదు. వారానికి ఒక్కరోజు కూడా కిరాయికి వాహనాన్ని నడపలేకపోతున్నాం. ఈ పరిస్థితిలో కేంద్రం మరోమారు ధరలు పెంచి మాపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది.
-నటరాజ్, ప్రైవేట్ వాహన నిర్వాహకుడు
భగ్గుమన్న బీఆర్ఎస్
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ రింగ్రోడ్డులో నిరసన ప్రదర్శన చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నదన్నారు.
-మన్సూరాబాద్, మే 15