సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా… ఇదీ కేసీఆర్ ప్రభుత్వ నినాదం. దానికి అనుగుణంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ సరఫరాను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విజయవంతంగా చేసింది. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అనధికార విద్యుత్ కోతలు, అంతరాయాలు ఎక్కువయ్యాయి. దీంతో నగరవాసులు ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా ఫిర్యాదులు చేస్తే వెంటనే @TsspdclCorporat పేరుతో ఉండే అకౌంట్లో ప్రతిస్పందించి 10-20 నిమిషాల్లో సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని పోస్టు చేశారు.
అయితే కొన్ని రోజులుగా గ్రేటర్ పరిధిలో వేసవి మరమ్మతుల పేరిట విద్యుత్ సరఫరాను 30 నిమిషాల నుంచి 2 గంటల పాటు నిలిపివేస్తున్నారు. ఒకవైపు తరచూ వచ్చే ఫిర్యాదులకు తోడు మరమ్మతుల మూలంగా సోషల్ మీడియాలో విద్యుత్ సరఫరాపై ఫిర్యాదులు రావడంతో వాటికి సమాధానం ఇచ్చేందుకు విద్యుత్ శాఖ మౌనం పాటిస్తోంది. ప్రస్తుతం విద్యుత్ వినియోగదారులు చేసే పోస్టులు తప్ప, టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి తిరిగి పోస్టులు రావడం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. గత డిసెంబర్లో ప్రతి రోజు 20 నుంచి 27 వరకు సందేశాలను టీఎస్ఎస్పీడీసీఎల్ సంస్థ పోస్టు చేసేది. ప్రస్తుతం ఒక్క పోస్టును కూడా ట్విట్టర్లో పెట్టడం లేదు. ఇటీవల ట్విట్టర్ వేదికగా టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ విద్యుత్ సరఫరాలో అంతరాయం చేసిన ట్వీట్ వైరల్గా మారి, ప్రతి రోజు 2 గంటలు విద్యుత్ కోతలు అన్నట్లుగా ప్రచారం కావడంతో ట్విట్టర్లో పోస్టు చేయడం లేదని తెలిసింది.