Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో వానాకాలం ఎండాకాలాన్ని తలపిస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాత్రి సమయాల్లో ఉక్కపోతతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్నాయి. సీతాఫల్మండిలో మంగళవారం అత్యధికంగా 37.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ పరిస్థితి అక్టోబర్ చివరి వారం వరకు కొనసాగే అవకాశం ఉంది.
ఐఎండీ హైదరాబాద్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రావణి మాట్లాడుతూ.. ప్రస్తుతం వానాకాలం నుంచి చలికాలానికి మారే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ సమయంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ నమోదు కాలేదన్నారు. దక్షిణ తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాలు ఎండల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. నవంబర్ నుంచి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందన్నారు. నవంబర్ రెండో వారంలో హైదరాబాద్లో వాతావరణంలో చాలా మార్పులు వస్తాయని పేర్కొన్నారు.