వానకాలం వచ్చేసింది….భారీ వర్షాలతో లోతట్టుగా ఉన్న కాలనీలు, బస్తీలు వరద నీటితో జలమయమయ్యే పరిస్థితులు నెలకొంటాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నది. సర్కిల్ 17లోని ఖైరతాబాద్, సోమాజిగూడ, అమీర్పేట్, సనత్నగర్ డివిజన్లలో సిబ్బంది, పనిముట్లు, మోటార్లతో మాన్సూన్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇప్పటికే ఎంఎస్మక్తాలోని లోతట్టు ప్రాంతంలో మూడు మోటార్లను ఏర్పాటు చేసింది. గతేడాది వరదనీరు రావడంతో వెనువెంటనే వాటిని తరలించి అప్పటికప్పుడే సమస్యను పరిష్కరించారు. ఈ ఏడాది వర్షాకాలంలో గుర్తించిన అన్ని ప్రాంతాల్లో ఈ సమస్య లేకుండా చర్యలకు జీహెచ్ఎంసీ ఉపక్రమించింది.
– ఖైరతాబాద్, జూన్ 23
ట్రాలీలు….మోటార్లు సిద్ధ్దం
సర్కిల్లోని నాలుగు డివిజన్లలో వరద నీటి సమస్య రాకుండా జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఎంఎస్మక్తాలో మూడు 5 హెచ్పీ మోటార్లు పనిచేస్తుండగా, అదనంగా అత్యవసర పరిస్థితుల్లో ట్రాలీ ఆటోలపై తరలించేందుకు 5 హెచ్పీ మోటార్లు (ఐదు), 10 హెచ్పి (రెండు) సిద్ధంగా ఉంచారు. నాలుగు డివిజన్లలకు ఒక్కో వాహనాన్ని కేటాయించగా, అందులో ఏడు నుంచి ఎనిమిది మంది సిబ్బంది పనిముట్లతో మాన్సూన్ ఎమర్జెనీ టీమ్ సిద్ధంగా ఉంటుంది. రాజ్నగర్, ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా, ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లలో వరద నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. అవసరమైన చోట వీటిని వినియోగించేందుకు సిబ్బంది సమాయత్తమవుతున్నారు.
24/7 అందుబాటులో సిబ్బంది
గత మే నెలలోనే సర్కిల్లో స్టాగ్నేషన్ పాయింట్లను గుర్తించి నివేదిక రూపొందించాం. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద స్టాగ్నేషన్ సమస్య ఉండేది. ఈ ఏడాది బాక్స్ డ్రైన్, కొత్త పైపులైను వేయడంతో ఆ సమస్య తీరిపోయింది. రాజ్భవన్ రోడ్డు, రోటరీ చౌరస్తా, లక్కీ హోటల్ ప్రాంతంలో కొంత నీరు నిలుస్తుంది. వర్షాలు కురిసినప్పుడు వెంటనే సిబ్బంది రంగంలోకి దిగుతారు. గుర్తించిన స్టాగ్నేషన్ పాయింట్ల వద్ద సిబ్బంది 24/7 షిఫ్టుల వారీగా అందుబాటులో ఉంటారు.
– చైతన్య, జీహెచ్ఎంసీ డీఈ