హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ బిల్లో సర్వీస్ చార్జి విధించడం సరికాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఇటీవల స్పష్టం చేసింది. బిల్లులో సర్వీస్ చార్జి యాడ్ చేస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. అందుకు 1915 టోల్ ఫీ నంబర్ను సైతం ఏర్పాటు చేసింది. అయినప్పటికీ నగరంలోని పలువురు హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు జీఎస్టీకి అదనంగా సర్వీస్ చార్జి వసూలు చేస్తూనే ఉన్నారు.
సిటీ బ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): మహానగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీల పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. వినియోగదారుల నుంచి సర్వీస్ చార్జీలు వసూలు చేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ వసూలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే జీఎస్టీ చార్జీలతో బిల్లు పెరుగుతుంటే.. సర్వీస్ చార్జీల మోత మోగిపోతున్నది. కనీసం 10-25శాతం వరకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వస్తున్నది. కుటుంబంతో కలిసి భోజనానికి వెళితే ట్యాక్సుల రూపంలోనే భారీగా చెల్లించాల్సి వస్తున్నది.
డోర్ డెలివరీ ఆర్డర్లకు 1-3శాతం చార్జి వేయాలి..!
దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జీలను వసూలు చేయకూడదనే నిబంధనలు అమలులోకి వచ్చాయి. కేవలం డోర్ డెలివరీ చేసే ఆర్డర్లపైనే 1-3శాతం సర్వీస్ చార్జ్జి వేయాలని నిబంధనలు ఉన్నాయి. అయితే అదనంగా టిప్పులు, జీఎస్టీతో కలిపి వినియోగదారుల నుంచి రెస్టారెంట్ల నిర్వాహకులు భారీగా వసూలు చేస్తున్నారు. ఒకప్పుడు సర్వీస్ చార్జీల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ నిబంధనలపై దేశవ్యాప్తంగా చర్చల తర్వాత బిల్లులో సర్వీస్ చార్జీలను చూపకుండానే వసూలు చేస్తున్నారు. ఇప్పటికే మెనూలోని ధరలను మార్చివేసి సర్వీస్ చార్జీలను సర్దుబాటు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఆహార పదార్థాలపై జీఎస్టీ వసూళ్లు
అన్ని సేవలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో డెలివరీ సేవలపై జీఎస్టీ భారం పడుతున్నది. ఉచితంగా డెలివరీ సేవలు అందించే ఫుడ్ యాప్ కంపెనీలు జీఎస్టీ పేరిట చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఒకప్పుడు రూ.100 సింగిల్ బిర్యానీ బుక్ చేసుకుంటే డెలివరీ చార్జీలతో కలిపి రూ.105-110 చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు జీఎస్టీ అమలు తర్వాత హోటల్ను బట్టి ఏకంగా రూ.125-135 వరకు కట్టాల్సి వస్తున్నది. తాజాగా ప్యాకేజ్డ్ ఫుడ్ మీద జీఎస్టీ చార్జీలను భారీగా వసూలు చేయడంతో సామాన్యుడు ఆన్లైన్ బుకింగ్ కంటే పికింగ్ నయం అనుకుంటున్నారు. ఇటీవల పిజ్జా బేస్లపై 5శాతం జీఎస్టీ వసూలు చేయగా, ప్యాకేజ్డ్ పరోటాలపై ఏకంగా 18శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.
సుమారు 2.5 లక్షల సర్వీస్ చార్జీలు
నగరంలో చిన్నా చితక కలిపి 13వేలకు పైగా రెస్టారెంట్లు, హోటళ్లు ఉండగా.. ఇందులో 3వేలకుపైగా లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. బిల్లుపై 5శాతం జీఎస్టీ ఉంటే రూ.3266 హోటల్ బిల్లుపై ఏకంగా రూ.165 అదనంగా వసూలు చేస్తున్నారు. సర్వీస్ చార్జీలు, టిప్పులు కలుపుకొని మొత్తం రూ.3581 చెల్లించాల్సి వచ్చిందని గచ్చిబౌలికి చెందిన గుణశేఖర్ వివరించారు.
ఇవ్వలేం..!
బిల్లుపై సర్వీస్ చార్జీలను తొలగించాలని వినియోగదారుల అభ్యర్థనకు కొందరు రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఐటీ కారిడార్ పరిసరాల్లోని హోటళ్లలో అదనపు బాధుడు ఏమాత్రం తగ్గట్లేదు. సర్వీస్ చార్జీల వసూళ్లపై హైదరాబాద్ హోటళ్ల నిర్వాహకులు కూడా భిన్నంగానే స్పందిస్తున్నారు. కరోనా తర్వాత హోటల్, రెస్టారెంట్లు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని, చార్జీల పెంపు, అదనపు చార్జీలతోనే ఈ రంగానికి భరోసా ఉంటుందని, ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు, నిర్వాహణ భారంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బిల్లులో అదనంగా రూ.153 కలిపారు
ఫ్రెండ్స్తో కలిసి మాదాపూర్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్కు వెళ్లాం. బిల్లు రూ.7672 అయితే ఇందులో రూ.153 అదనంగా ఉందని బిల్లు కట్టిన తర్వాత తెలిసింది. దీనిపై హోటల్ మేనేజర్ను వివరణ కోరగా జీఎస్టీ అని బుకాయించాడు. తీసుకున్న ఫుడ్, లిక్కర్ లెక్క తీయడంతో జీఎస్టీతోపాటు అదనంగా కలిపిన సర్వీస్ చార్జీ అని అర్ధమైంది.
– సుధాంశ్, ఐటీ ఉద్యోగి, పద్మారావు నగర్
సర్వీస్ చార్జీలు ఇవ్వొద్దు..!
హోటల్కు వచ్చిన కస్టమర్ నుంచి తప్పనిసరిగా సర్వీస్ చార్జీ వసూలు చేయలేం. కరోనా తర్వాత హోటల్ రంగం ఒక్కసారిగా పడిపోయింది. పెరిగిన నిత్యావసర ధరలు, లేబర్ చార్జీలతోపాటు ఒకప్పుడు ఉన్నంత బిజినెస్, లాభం ప్రస్తుతానికైతే లేవు. బిల్లు మీద వసూలు చేసే సర్వీస్ చార్జీలతో నిర్వాహణ భారం ఏమాత్రం తగ్గదు. కానీ అంతకంటే ఎక్కువ దుష్ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా ఫ్యామిలీ, గ్రూప్, కార్పొరేట్ లంచ్లపై డిస్కౌంట్లను ఇచ్చి కస్టమర్లను ఆకట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
– మొహీద్, ఓ హోటల్ మేనేజర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు