ఏడు నెలల గర్భిణి. ముగ్గురు కవలలు ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో సంతోషించాం. మంచి వైద్యం కోసమని కార్పొరేట్ను ఆశ్రయించాం. ఏడవ నెలలోనే నొప్పులు రావడంతో పరీక్షలు జరిపిన కార్పొరేట్ వైద్యులు నెలలు నిండకుండానే ప్రసవం జరుగుతుందని చెప్పారు. ప్రీటర్మ్ డెలివరీ కారణంగా పిల్లలు బతకడంపై భరోసా ఇవ్వలేమన్నారు. శిశువులను ఐసీయూలో పెట్టాల్సి వస్తుందని, అందుకోసం ఒక్కో శిశువుకు రోజుకు రూ.50వేల చొప్పున ముగ్గురు శిశువులకు కలిపి ప్రతి రోజు రూ.1.5లక్షలు ఖర్చవుతుందన్నారు. మొత్తం రూ.40లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. అయినా పిల్లలు బతుకుతారనే భరోసా ఇవ్వలేదు. దీంతో నిలోఫర్ దవాఖానలో చేరాం.. నా భార్యా బిడ్డలకు భరోసా ఇవ్వడంతో పాటు వారిని బతికించి చూపించారు సర్కార్ వైద్యులు’. ఇది ఎవరో చెప్పిన కథ కాదు. నిలోఫర్ వైద్యులు, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటన అసలే కాదు. కార్పొరేట్ భారాన్ని మోయలేని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంభానికి చెందిన వ్యక్తి తన అనుభవాలు, ప్రభుత్వ దవాఖానలో తన భార్యకు అందిన ఉత్తమ వైద్యసేవలను స్వయంగా వెల్లడించిన కథనం.
– సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ)
అత్తాపూర్ ప్రాంతానికి చెందిన సాయికుమార్ పాత్రికేయుడు. అతడి భార్య గర్భం దాల్చడంతో సురక్షిత ప్రసవం కోసం కార్పొరేట్ దవాఖానను ఆశ్రయించాడు. ప్రతి నెలా పరీక్షలు చేయించి అవసరమైన చికిత్స ఇప్పిస్తున్నాడు. అయితే మే 5న 7నెలల గర్భవతి అయిన ఆమెకు పెయిన్స్ రావడంతో మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ను ఆశ్రయించారు. అక్కడ పరీక్షలు జరిపిన వైద్యులు గర్భవతికి 7వ నెలలోనే ప్రసవం అవుతుందని తెలిపారు. పుట్టిన శిశువుల బరువు కూడా తక్కువగా ఉంటుందని, అందుకని శిశువులను ఐసీయూలో పెట్టాల్సి వస్తుందని చెప్పారు. అందుకోసం ఒక్కో శిశువుకు రూ.50వేలు చొప్పున ముగ్గురికి కలిపి రోజుకు రూ.1.5లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అయినా పిల్లలు బతుకుతారనే భరోసా మాత్రం ఇవ్వలేదని సాయి కుమార్ తెలిపారు. చేసేది లేక బరువెక్కిన గుండెతో నిలోఫర్ దవాఖానను ఆశ్రయించగా అక్కడి వైద్యులు తన భార్యా బిడ్డల ప్రాణాలకు పూర్తి భరోసా ఇచ్చినట్లు శిశువుల వివరించాడు.
ఒకే కాన్ఫులో ముగ్గురు కవలలు
మే 5న రాత్రి దవాఖానలో చేర్పించగా 6న ప్రసవం జరిగిందని, ముగ్గురు కవలలు జన్మించగా అందులో ఒక శిశువు కిలో, రెండవ శిశువు 1.3 కిలోలు, బరువు ఉండగా మూడవ శిశువు 400గ్రాముల బరువుతో జన్మించినట్లు తెలిపాడు. అతి తక్కువ బరువుతో జన్మించిన మూడవ శిశువు మృతిచెందగా మిగిలిన ఇద్దరు శిశువులను దాదాపు రెండు నెలల పాటు ఎస్ఎన్సీయూలో పెట్టి ప్రత్యేక వైద్యం అందించినట్లు వైద్యులు వెల్లడించారు. తక్కువ బరువు ఉన్న శిశువుల్లో ఒక శిశువు 1 కేజీ నుంచి 1.6కేజీకి, 1.3కేజీల బరువున్న శిశువు 2కేజీలకు పెరగడంతో పాటు ప్రస్తుతం తల్లీ బిడ్డలు పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. రెండు నెలల పాటు చికిత్స పొందిన సాయికుమార్ భార్యా పిల్లలను ఇటీవలే దవాఖాన నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
ట్రిప్లేట్ కేసుల్లో ప్రీటర్మ్ అవకాశాలు ఎక్కువ
సాధారణ గర్భిణిలతో పోల్చితే కవల పిల్లలు ఉన్న గర్భిణులకు కొంత మెటర్నరీ రిస్క్ ఉంటుంది. అయితే ఇద్దరి కంటే ఎక్కువ మంది శిశువులున్న గర్భిణులకు ఈ రిస్క్ మరింత ఎక్కువ. అశ్విని విషయంలో ముగ్గురు కవలలు ఉండడం ప్రీటర్మ్ డెలివరీకి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రతి రోజు నిలోఫర్కు ఇలాంటి హై రిస్క్ కేసులు వస్తుంటాయి. ఎక్కువగా ప్రైవేటు హాస్పిటల్స్ నుంచి రెఫరల్స్ వస్తుంటాయి. చాలా సందర్భాల్లో వారు తమ వల్ల కాదని ఇక్కడకు పంపిన కేసులను సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. నిలోఫర్లో అత్యాధునిక ఎస్ఎన్సీయూ, ఎన్ఐసీయూతో పాటు ఎంఐసీయూ, కంగారు మదర్ కేర్ వంటి వసతులు అందుబాటులో ఉన్నందున ఇలాంటి క్లిష్టమైన కేసులను విజయవంతంగా ట్రీట్ చేయగలుగుతున్నాం.
– డాక్టర్ ఉషారాణి, సూపరింటెండెంట్, నిలోఫర్ దవాఖాన