పిల్లలకు పాఠాలు చెప్పడంతోనే తన బాధ్యత తీరిపోయిందని అతడు భావించలేదు. మాటలకన్నా చేతలు గొప్పవని నమ్మినవాడు. ఓ వైపు పాఠాలు బోధిస్తూనే మరోవైపు రోగుల సహాయకుల ఆకలిని తీరుస్తున్నాడు. తరగతి గదిలో రేపటి భావి భారత పౌరులను ఉన్నతంగా తీర్చిద్దేందుకు కృషి చేస్తూనే మరోవైపు సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటూ ఉపాధ్యాయుడు అంటే ఇలా ఉండాలని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఓవైపు తన విద్యార్థులకు విద్యా బోధన చేస్తూనే మరో వైపు మహదీ నవాజ్ జంగ్ (ఎంఎన్జే) క్యాన్సర్ దవాఖాన వద్ద రోగులతోపాటు వారి సహాయకులకు తన మిత్రులతో కలిసి ప్రతిరోజూ భోజన సదుపాయం కల్పిస్తున్నారు. చికిత్స కోసం నగరానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారి ఆకలిని తీరుస్తూ.. మానవతను చాటుతున్నారు. సామాజిక సేవలో భాగంగా తమకు తోచిన సాయాన్ని అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. నగరంలోని రెడ్హిల్స్ ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన వద్ద రాత్రివేళలో రోగి సహాయకులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఏడాది నుంచి భోజనవసతిని కల్పిస్తూ.. మంచి మనసును చాటుకున్నాడు మహ్మద్ బషీరుద్దీన్.
గోల్కొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న బషీర్.. ప్రతిరోజు రాత్రి 7.30గంటలకు ఎంఎన్జే దవాఖాన వద్ద రోగి సహాయకులకు ఆహారాన్ని అందజేస్తూ సుమారు 200 మంది ఆకలి తీరుస్తున్నారు. ఇట్లా వారమో, నెలనో కాదు.. ఏడాది పొడవునా నిత్యం రోగి సహాయకులకు అన్నం అందజేస్తున్నారు. కాగా మార్చి 5వ తేదీ నాటికి 362వ రోజుకు నిత్యాన్నదానం చేరుకుంది. ఉదయం పూట పలువురు దాతలు అల్పాహారం పంపిణీ చేన్నారు. మధ్యాహ్నం ప్రభుత్వం అందజేస్తున్న రూ.5ల భోజనం చేస్తూ కడుపు నింపుకుంటున్నారు. అయితే రాత్రిపూట మాత్రం డబ్బులు లేక పస్తులుండాల్సిన సందర్భాన్ని గమనించిన హెచ్ఎం బషీర్.. వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.
ఇక్కడికి ఎక్కువగా పేదలే వస్తుంటారు. రాష్ట్రవ్యాప్తంగా దవాఖానకు వచ్చే వారు ఆకలితో అలమటించకూడదని తాను భావించాను. ఆకలి అంటే ఏమిటో తనకు తెలుసని ప్రధానోపాధ్యాయుడు బషీర్ పేర్కొన్నారు. ఎంతో దూరం నుంచి వచ్చి.. కొన్ని సందర్భాల్లో డబ్బులు లేక పస్తులుండాల్సి వచ్చిందని తెలుసుకున్నప్పుడు మనుసు చలించింది. పిల్లలకు చదువుతో పాటు పేదల ఆకలిని తీర్చి ఆదుకోవాలనే ఆలోచన తనను నడిపిస్తుందని దాతల సహకారంతో ఈ కార్యానికి పూనుకున్నానని బషీర్ చెబుతున్నారు.
సోషల్ వర్కర్ ఫహద్ బిన్ హుస్సేన్, అడ్వకేట్ ఇక్బాల్ రషీద్, ఎస్టీయూ నాయకుడు హుస్సేన్ ఆలం, మహ్మద్ ఫసియుద్దీన్, మహ్మద్ రజీయుద్దీన్, అజీజ్ అహ్మద్ సాహెబ్, మహ్మద్ అహ్మద్ సాహెబ్, హదియా బేగం, సాహెబా, హజీరా బేగం సాహెబా, సన్నిది సుబ్బారావు, ఎంఏ ఖాదర్, డాక్టర్ పర్వీన్, రాంసింగ్ కుటుంబ సభ్యులతో పాటు మరికొందరితో కలిసి సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు.