ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తాం
మడ్ఫోర్డ్లో నల్లా కనెక్షన్లు
ప్రారంభించిన ఎమ్మెల్యే సాయన్న
సికింద్రాబాద్, ఏప్రిల్ 30: నియోజకవర్గంలోని ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. మడ్ఫోర్డ్లోని డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్ద ప్రభుత్వం సుమారు రూ.23.50వేల నిధులతో తాగునీటి నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేయగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ ఉచితంగా డబుల్ బెడ్రూంలను కట్టించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వాలనే క్రమంలో సర్కారు నిధులను మంజూరు చేసిందన్నారు. దీంతో కంటోన్మెంట్ బోర్డు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పనులను వేగవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు.
త్వరలోనే మడ్ఫోర్డ్ అంబేద్కర్ హాట్స్లో తాగునీటి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుందని, రెండు రోజుల క్రితమే తిరుమలగిరిలోని జేఎన్ఎన్యూ ఆర్ఎం సముదాయాల వద్ద ఇంటింటికీ నల్లా నీళ్లను అందించినట్లు తెలిపారు. ప్రధానంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక, అధికారుల సమన్వయంతో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ మహిళా నాయకురాలు నివేదిత, బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, నేతలు ముప్పిడి మధుకర్, సరిత, సదానంద్గౌడ్, మురళీయాదవ్, భాస్కర్ ముదిరాజ్, సంతోష్, కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్స్ అధికారి శశాంక్ పాల్గొన్నారు.