దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతను కల్పించింది. రూపాయికి కిలో చొప్పున రేషన్ బియ్యం ఇచ్చేందుకు సోమవారం కొత్త కార్డులను పంపిణీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలో 10,80,365 లక్షల కుటుంబాల్లో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం అందుతుండగా, తాజాగా మరో 86,119 కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. దీంతో మొత్తం 46లక్షల పైచిలుకు మందికి 6కిలోల చొప్పున బియ్యం అందనున్నది. సోమవారం బేగంపేటలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మేడ్చల్ జిల్లాలో మంత్రి చామకూర మల్లారెడ్డి, ఆయా సర్కిళ్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు అందజేశారు. ఈ నెలాఖరు వరకు లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొత్త కార్డుల ద్వారా 86వేల పైచిలుకు లబ్ధిదారులకు ఆగస్టు నుంచి రేషన్ అందనుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ఆహార భద్రత కార్డులు అందజేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని కార్డులు పొందిన లబ్ధిదారులు తెలిపారు.
సిటీబ్యూరో, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ అర్హులందరికీ తెల్లరేషన్ కార్డులు అందజేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సోమవారం బేగంపేటలోని జురాస్టియనల్ క్లబ్లో మంత్రి తలసాని నూతన తెల్లరేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తొలిరోజు సర్కిళ్ల వారీగా గుర్తించిన వెయ్యి మంది లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. తెల్లరేషన్ కార్డుల జారీ ప్రక్రియ వారం రోజులు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలోని తొమ్మిది సర్కిళ్లలో 56,064 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. దీంతో జిల్లాలో 2.25లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కొత్తగా తెల్ల రేషన్ కార్డులు పొందిన వారికి ఆగస్టు నుంచి రేషన్ పంపిణీ చేసే విధంగా చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 5,85,756 తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. వాటి ద్వారా 21,90,034 మంది పేదలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ సురభి వాణీదేవి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, హైదరాబాద్ జిల్లా సీఆర్వో బాలమాయాదేవి, జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్ ఎ.రమేశ్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్, జూలై26(నమస్తే తెలంగాణ): అర్హులైన లబ్ధిదారులకు రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో 30,055 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు. సోమవారం కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాలో 4,94,609 రేషన్కార్డులు ఉండగా కొత్తగా మరో 30,055 రేషన్కార్డులు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలో రేషన్కార్డులు 5,24,664కు చేరనున్నాయి.
రేషన్కార్డు పొందడం సంతోషంగా ఉంది. రేషన్కార్డులను అందించి సీఎం కేసీఆర్ నిరుపేదలకు అండగా నిలిచారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంకు రుణపడి ఉంటాం. నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలుస్తాం. – రాంపల్లి హారిక, మూడుచింతలపల్లి
అర్హులను గుర్తించి రేషన్కార్డులు అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఒకప్పుడు రేషన్కార్డులు పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దరఖాస్తు చేసుకున్న వారి కుటుంబ పరిస్థితులను గుర్తించి ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్ పేదల పక్షమని నిరూపించుకున్నారు. – అశ్విని, జగ్గంగూడ