సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): జంతు ప్రేమికులు జర జాగ్రత్త.. వీధి కుక్కలకు ఎక్కడంటే అక్కడ ఆహారాన్ని అందిస్తామంటే కుదరదు. శునకాల సంక్షేమానికి ఏర్పాటు చేసిన ఆయా స్థానిక కమిటీల అనుమతితోనే ఆహారం, నీరు అందించాలి. ప్రస్తుతం శునకాలకు ఫుడ్, వాటర్ అందించే కార్యక్రమాలను జంతు ప్రేమికులు స్వేచ్ఛగా నిర్వహిస్తున్నారు. దీని వల్ల కొన్ని చోట్ల అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. వీధి కుక్కల నియంత్రణపై యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా (ఏడబ్ల్యూబీఐ) కొత్త మార్గదర్శకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో వీధి కుక్కలకు సంబంధించిన ఘటనలు అదుపు తప్పుతున్న తరుణంలో జంతువులపై క్రూర త్వ నిరోధక చట్టం 1960 ప్రకారం జంతు జనన నియంత్రణ నియమాలు 2023ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. గ్రేటర్లో ప్రస్తుతం నాలుగు జంతు సంరక్షణ కేంద్రాలుండగా..రోజూ 400 నుంచి 500 శునకాలకు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఆయా కేంద్రాల్లో జరిగే చికిత్సలు, చికిత్స పొందే శునకాల వివరాలను జీహెచ్ఎంసీ నివేదిక రూపంలో స్థానిక పర్యవేక్షణ కమిటీకి అందించనుంది.