“నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు అన్న రోజులు పోయి.. నేను సర్కారు దవాఖానకే పోత బిడ్డా..” అన్న రోజులు వచ్చాయి. సరిగ్గా తొమ్మిదేళ్ల కిందట, తెలంగాణ రాక ముందు వైద్య రంగం ఎంత దుర్భర స్థితిలో ఉండేదో.. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత మెరుగు పడిందో చెప్పుకుంటున్న తెలంగాణ ప్రజలు.. మళ్లీ రావాలి మనస్సుగళ్ల సర్కారు అంటూ కోరుకుంటున్నారు.
– సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ)
తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీఠ వేసిన విషయం తెలిసిందే. దీంతో సర్కార్ దవాఖానలు కార్పొరేట్ దవాఖానలతో పోటీ పడుతున్నాయి. నగరంలో ప్రధాన దవాఖానలైన ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, మానసిక రోగుల దవాఖానలతో పాటు నిమ్స్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. నగరంలోని ప్రభుత్వ దవాఖానలను అన్ని విధాలుగా బలోపేతం చేయడంతో కరోనా సమయంలో పొరుగు రాష్ర్టాలైన ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక నుంచి చికిత్స కోసం పెద్ద ఎత్తున రోగులు తెలంగాణకు క్యూ కట్టడం నగర ఆరోగ్య రంగ అభివృద్ధికి నిదర్శనంగా చెప్పవచ్చు. నగరంలోని పేట్లబుర్జ్, సుల్తాన్బజార్, నిలోఫర్, గాంధీ తదితర ప్రసూతి హాస్పిటల్స్లో తల్లీ బిడ్డ సంరక్షణ కోసం ప్రత్యేక వసతులు, వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా మాతా శిశు మరణాలను తగ్గించేందుకు అన్ని ప్రసూతి దవాఖానల్లో ఎంఐసీయూ వార్డులను ఏర్పాటు చేశారు. బిడ్డ ఎదుగుదల, ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అన్ని ప్రసూతి కేంద్రాల్లో టిఫా స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఇనిస్టిట్యూషనల్ డెలివరీలు పెంచేందుకు కేసీఆర్ కిట్స్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతే కాకుండా అనవసరంగా జరిగే సీ-సెక్షన్లకు సైతం చెక్ పెట్టడంతో ఆరోగ్యవంతమైన సహజ ప్రసవాలు పెరిగాయి.
సూపర్స్పెషాలిటీ సేవలను మరింత విస్తరించే క్రమంలో సీఎం కేసీఆర్ మార్గదర్శకాల మేరకు నగరం చుట్టూ నాలుగు సూపర్స్పెషాలిటీ హాస్పిటల్స్కు పునాధులు వేశారు. 2000 పడకల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈ దవాఖానలు ప్రారంభమైతే 8వేల సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం టి-డయాగ్నోస్టిటిక్ సెంటర్ను నారాయణగూడలోని ఐపీఎంలో ఏర్పాటు చేసింది. బస్తీ దవాఖాన నుంచి జిల్లా దవాఖాన వరకు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో రోగుల నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించి టీ-డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపుతారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన తరువాత మెడికల్ రిపోర్ట్స్ను ఆన్లైన్ ద్వారా తిరిగి సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు పంపుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైద్యరంగంలో పెను మార్పులు తీసుకువచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వైద్యసేవలను ప్రజలకు మరింత చేరువ చేసింది. ఈ క్రమంలోనే కరోనా సమయంలో టెలీ మెడిసిన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రోగులు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవల కోసం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి పెద్ద హాస్పిటల్స్కు వెళ్లకుండానే తమ నివాస ప్రాంతాల్లో ఉన్న బస్తీ దవాఖానల నుంచే సంబంధిత వైద్యుల కన్సల్టేషన్ను పొందే సదుపాయాన్ని ఈ టెలీమెడిసిన్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల రోగులు ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, రోజువారి పనులు చేసుకునేవారు టెలీమెడిసిన్ ద్వారా నిమ్స్, ఉస్మానియా, గాంధీ వైద్యుల కన్సల్టేషన్ పొందుతున్నారు.
కరోనా సమయంలో రెండు తెలుగు రాష్ర్టాలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ హాస్పిటల్ వేల మంది ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటుకు ముందు గాంధీ దవాఖానకు కేవలం నిరుపేద రోగులు మాత్రమే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వచ్చేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గాంధీ దవాఖాన ముఖ చిత్రం మారింది.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.100కోట్లతో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ను విస్తరించి కొత్తగా అంకాలజి బ్లాక్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ప్రత్యేకంగా బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కు ప్రత్యేక బ్లాక్ నిర్మించింది. కార్పొరేట్ను తలదన్నే రీతిలో రోబో థియేటర్లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో 450పడకల సామర్ధ్యం ఉన్న ఎంఎన్జే కొత్తగా అందుబాటులోకి వచ్చిన 500పడకలతో 950 పడకల సామర్థ్యానికి పెరిగింది.
నిమ్స్ దవాఖానను రూ.1571 కోట్లతో 2వేల పడకల సామర్ధ్యంతో విస్తరించనున్నారు. 32ఎకరాల 16గుంటల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కొత్త భవన సముదాయంలో 4బ్లాక్లు ఏర్పాటు కానున్నాయి. ఇందులో కొత్తగా 32మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 2వేల పడకలకు ఆక్సీజన్ సౌకర్యం, 500 పడకలను ఐసీయూకు కేటాయించనున్నారు. దీంతో నిమ్స్ దవాఖాన దేశంలోనే అతి పెద్ద మల్టీస్పెషాలిటీ హాస్పిటల్గా నిలువనున్నది.
ప్రస్తుత రోజుల్లో చికిత్స ఖర్చుల కంటే వైద్యపరీక్షల ఖర్చే రెట్టింపు అవుతున్నది. ఇది గమనించిన తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ పరిధిలో 24మినీ హబ్స్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీ తదితర ఖరీదైన పరీక్షలు జరుపుతున్నారు.
ఉస్మానియా, గాంధీ దవాఖానలపై భారం తగ్గించడమే కాకుండా రోగులకు ప్రాథమిక స్థాయిలోనే వైద్యం అందించి వ్యాధులను ఎక్కడికక్కడ అరికట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2020-2021 కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా ప్రైవేటు దవాఖానలు సైతం సేవలను నిలిపివేసినప్పుడు ఈ బస్తీ దవాఖానలే రోగులను ఆదుకున్నాయి. 55 రకాల వైద్యపరీక్షలు, 126 రకాల మందులతో గ్రేటర్ వ్యాప్తంగా బస్తీ దవాఖానలు రోగులకు సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలోనే 166, రంగారెడ్డి జిల్లా పరిధిలో 65, మేడ్చల్ జిల్లా పరిధిలో 94 బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటితో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీని వల్ల మారుమూల ప్రాంతానికి సైతం ప్రాథమిక వైద్యం చేరువైంది.