తెలుగుయూనివర్సిటీ, సెప్టెంబర్ 22 : ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు త్వరలోనే రోబోటిక్ థియేటర్ను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. రెడ్హిల్స్లోని ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానలో త్వరలో అందుబాటులోకి రానున్న నూతన భవన నిర్మాణ పనుల పురోగతి, పెండింగ్ పనులు, వైద్య సేవలు.. తదితర అంశాలపై గురువారం సాయం త్రం వైద్యాధికారులతో మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. పలు వార్డుల్లో కలియ తిరిగిన మంత్రి రోగులకు అందుతున్న వైద్య సేవలపై వారితో మాట్లాడి తెలుసుకున్నారు. సమీక్షా సమావేశం అనంతరం మంత్రి, దవాఖాన డైరెక్టర్ డాక్టర్ జయలత వివరాలను వెల్లడించారు.
ఎంఎన్జేకు రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 450 పడకలకు తోడు మరో 300 పడకల మరో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. దీంతో రోగులకు 700 పడకలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అక్టోబర్ 15న నూతన భవనాన్ని ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాకు చెందిన డాక్టర్ శరత్ ఎంఎన్జే దవాఖానకు 300 బెడ్స్ను, హౌజ్కీపింగ్ సౌకర్యాలను, సెక్యూరిటీ సిబ్బంది నిర్వహణకు ఖర్చు చేసేందుకు దాతృత్వంతో మూడేండ్ల కాలపరిమితికి ముందుకు వచ్చారని, ఇది మంచి పరిణామమని అన్నారు. వైద్యులు, సిబ్బంది కొరతను త్వరలోనే అధిగమిస్తామని మంత్రి పేర్కొన్నారు. నూతన భవనంలో ఆయా శాఖల అధికారుల సమన్వయంతో తనిఖీలు నిర్వహించి, త్వరలోనే అనుమతులతో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు, దర్శకులు విజయేంద్రప్రసాద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.