ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 7: విద్యార్థులకు నాణ్యమైన విద్య, అత్యాధునిక మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించనున్న సెంటెనరీ(శతాబ్ది) పరిపాలనా భవన నిర్మాణ పనులకు హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డితో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… ఎన్నో ఉద్యమాలకు కేంద్ర బిందువుగా చారిత్రక ఖ్యాతి ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో మెరుగైన విద్యా బోధన, వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఓయూలో గత నెలలో బాయ్స్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, మరో హాస్టల్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు.
ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ మాట్లాడుతూ… ప్రస్తుత పరిపాలనా భవనం 1960లో నిర్మించారని, అరవై ఏండ్ల పైబడిన భవనం కావడంతో మరమ్మతుల కోసం అధిక మొత్తంలో నిధులు వెచ్చించాల్సి వస్తోందన్నారు. త్వరలోనే మరో హాస్టల్ భవన సముదాయం, శతాబ్ది పైలాన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల, బీ హాస్టల్, డీ హాస్టల్ మరమ్మతు పనులు, బీఈడీ కళాశాలలోని మెట్ల బావి పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సహకరించిన మంత్రి కేటీఆర్కు ఓయూ వీసీ కృతజ్ఞతలు తెలిపారు. నూతన పరిపాలనా భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్లకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, రాష్ట్ర విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, యూజీసీ డీన్ ప్రొఫెసర్ జి.మల్లేశం, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, డీన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
పరిపాలనా భవనం ప్రత్యేకతలు..
పదిహేను ఎకరాల విస్తీర్ణం, రూ.33.75 కోట్ల నిర్మాణ వ్యయంతో జీ ప్లస్ టు అంతస్తులతో పరిపాలనా భవనాన్ని నిర్మించనున్నారు. 123 గదులతో 1,08,020 చదరపు అడుగుల విస్తీర్ణంలో చేపట్టనున్నారు. తొమ్మిది నెలల్లో పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ పరిపాలనా భవనాన్ని అత్యున్నతమైన సకల సౌకర్యాలతో, అందరికీ అందుబాటులో ఉండే లా నిర్మించనున్నారు. ఈ భవన నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్ నిబంధనలను సంపూర్ణంగా పాటించడంతో పాటు సోలార్ విద్యుత్ను వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించామని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ వివరించారు.