Hyderabad | సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ ) : స్వచ్ఛ సర్వేక్షణ్-23లో జీహెచ్ఎంసీకి జాతీయ స్థాయి క్లీన్ సిటీ అవార్డులు వరించాయి. లక్ష జనాభా పైబడిన నగరాల్లో ఆల్ ఇండియాలో 9వర్యాంకు సాధించి, ఫైవ్స్టార్ రేటింగ్లో ఈ అవార్డును దక్కించుకుంది.
ఢిల్లీలో భారత మండపం వేదికగా గురువారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి నుంచి అవార్డును జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ సోమ భరత్, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల అందుకున్నారు.
తెలంగాణలో స్వచ్ఛ నగరం, తెలంగాణలో మొదటి 5 స్టార్ రేటింగ్ పొందిన నగరం, వాటర్+సిటీగా మళ్లీ ధ్రువీకరించబడిందని అధికారులు తెలిపారు. కాగా 2023 సంవత్సరానికిగానూ ఐదు అవార్డులు దక్కడం కేసీఆర్ ప్రభుత్వానికే ఈ గుర్తింపు దక్కింది.
పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్ తీసుకున్న చొరవతో నగరానికి జాతీయ స్థాయి అవార్డులు వరించాయి. జాతీయ స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్కు 5 అవార్డులు దక్కడంలో విశేష కృషి చేసిన ప్రతి ఒక్కరికీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ రొనాల్డ్ రాస్ ధన్యవాదాలు తెలిపారు.