నిపుణ ఆధ్వర్యంలో ఉద్యోగార్థులకు దిశానిర్దేశం
నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే అవగాహన సదస్సు గ్రాండ్ సక్సెస్
నల్లగొండ/రామగిరి, జూన్ 13 : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంపై వేల కాంతులతో కొలువుల పొద్దు పొడుస్తున్న తరుణాన నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే దినపత్రికలు మరోమారు గురుతర బాధ్యతను భుజానికెత్తుకున్నాయి. దగాపడ్డ నేలపై నాడు ఏ ఉద్యోగాల కోసమైతే ఉద్యమానికి మద్దతుగా నమస్తే తెలంగాణ అక్షర యుద్ధం చేసిందో.. నేడు అదే కొలువులు తెలంగాణ బిడ్డలకు చేరువవుతున్న సమయాన విజయానికి సోపానాలు వేసింది. సందేహాలను నివృత్తి చేసింది. భయాలను దూరం చేసి, కొత్త ఉత్సాహం నింపింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం సోమవారం నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సు దిగ్విజయంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వెయ్యి మందికిపైగా అభ్యర్థులు తరలివచ్చారు. నాలుగు గంటలపాటు సాగిన కార్యక్రమంలో సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాల లత, వేప అకాడమీ డైరెక్టర్ సీఎస్ వేప విలువైన సలహాలు ఇవ్వడంతో పాటు సందేహాలను నివృత్తి చేశారు.
సదస్సులో మాట్లాడుతున్న నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత, చిత్రంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వేప అకాడమీ డైరెక్టర్ సీఎస్ వేప, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ తొవిటి మహేందర్, ఎడిషన్ ఇన్చార్జి నరేందర్, బ్యూరో ఇన్చార్జి మహేందర్రెడ్డి, నిపుణ ఇన్చార్జి వేంకటేశ్వరశర్మ, ఈవెంట్స్ మేనేజర్ గణేశ్
సదస్సుకు వస్తున్న ఉద్యోగార్థులు
టైం మేనేజ్మెంట్ ముఖ్యం
ఉద్యోగాలకు సిద్ధమయ్యేవారు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగాలి. సోషల్మీడియా, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి. సరిపోను నిద్ర ఉంటేనే మెదడు చురుగ్గా ఉంటుంది. చదివిన అంశాలను చిత్రాలు, నంబర్స్ రూపంలో గుర్తుంచుకుంటే చాలాకాలంపాటు మరిచిపోరు. చాలామంది విద్యార్థులు రేపు ఎగ్జామ్ అనగా చదువుతారు.. అది మంచి పద్ధతి కాదు. పోటీ పరీక్షల్లో విజయం అనేది ప్రణాళికతో చదివితేనే వస్తుంది. ఒక రోజులో చదివిన అంశాల్లో మరుసటి రోజుకు 20 శాతమే గుర్తుంటాయి.. రివిజన్ చేసుకోవడం ద్వారా ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు. చదువుకు టైం మేనేజ్మెంట్ ముఖ్యం. అర్థమెటిక్స్, రీజనింగ్ సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోవాలంటే రోజువారీగా మనం చేసే పనుల్లోనూ వాటిని అన్వయించుకోవాలి.
– సీఎస్ వేప, వేప అకాడమీ డైరెక్టర్
ప్రతి మార్కూ విలువైందే..
గ్రూప్స్తోపాటు పోలీస్ ఉద్యోగార్థులు తెలంగాణ ఉద్యమ చరిత్రపై దృష్టి సారించాలి. ప్రధానంగా మన పండుగలు, జాతరలు, మాండలిక పదాలపై అవగాహన పెంచుకోవాలి. ఒక్క మార్కే కదా అని నిర్లక్ష్యం చేయొద్దు, ఆ ఒక్క మార్కే జీవితాన్ని మార్చి వేస్తుంది. జాన పద కళలు, హస్తకళలు, తెగలపైనా గత పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణ చరిత్రను మూడు భాగాలుగా విభజించి చదువాలి. నిరంతరం కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఉదయించే సూర్యుడిని చూసి చీకటి కష్టపడి చదివే ఉద్యోగార్థులను చూసి ఓటమి భయపడుతాయి.
– మందడి నాగార్జున రెడ్డి, తాసీల్దార్, నల్లగొండ
నాడు ఉద్యమానికి, నేడు ఉద్యోగార్థులకు అండగా నమస్తే తెలంగాణ
నమస్తే తెలంగాణ పత్రిక నాడు ఉద్యమానికి, నేడు నిపుణ ద్వారా ఉద్యోగార్థులకు అండగా నిలిచింది. ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. నిపుణ ద్వారా నిపుణులతో మంచి మెటీరియల్ అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 83వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతుండడంతో ప్రతి రోజూ నాలుగు పేజీలు, ప్రతి వారం ఎనిమిది పేజీలు స్టడీ మెటీరియల్ అందిస్తున్నాం. ఉద్యోగార్థులను అన్ని పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ విజయం సాధించేలా సదస్సుల ద్వారా భరోసా నింపుతున్నాం.
– కె. వేంకటేశ్వర శర్మ, నిపుణ ఇన్చార్జి
సమయం వృథా చేయొద్దు
ఉద్యోగం కొట్టాలంటే మొబైల్ చూడడం వంటి అలవాటన్లను త్యాగం చేయాలి. అనవసరమైన వాటిన్నంటినీ వదులుకొని దృఢసంకల్పంతో చదువాలి. మా రోజుల్లో ఇన్ని నోటిఫికేషన్లు లేవు. అప్పుడు పుస్తకాలు దొరుకడమే కష్టమైతుండే. ఈ తరం వాళ్లు అదృష్టవంతులు. అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధించాలి.
– వనమాల చంద్రశేఖర్, నల్లగొండ అదనపు కలెక్టర్
నిత్య సాధనతోనే విజయం
చదువుకు పేదరికం అడ్డుకాదు. స్వశక్తితో ఏ ఉద్యోగానికి సిద్ధమవుతున్నారన్నదే ముఖ్యం. అందుకు
అనుగుణంగా ప్రణాళికతో చదివి సిలబస్పై పట్టు సాధించాలి. ఏ పోటీ పరీక్షలోనైనా ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అంశాలపై ప్రశ్నలుంటాయి. వీటిని క్షణ్నంగా చదువాలి. చాలామంది అంతర్జాతీయ అంశాలు చదువడం లేదు. వాటిపైనా దృష్టి పెట్టాలి. యూపీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి కఠినంగా ఉంటుంది. చదివిన ప్రతి సబ్జెక్టులో సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. ఎన్సీఈఆర్టీ, తెలుగు అకాడమీ పుస్తకాలు చదువాలి. సైబర్ సెక్యూరిటీ, సూపర్ కంప్యూటర్ టెక్నాలజీ, సైబర్ టెక్నాలజీ అంశాలు చదువాలి. బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, రోబోటిక్, 4జీ, 5జీ సేవలతోపాటు 3డీ, 4డీ వైఫై, లైఫై టెక్నాలజీలపైనా అవగాహన పెంచుకోవాలి. రోజూ దినపత్రికలు చదివితే 50 నుంచి 60శాతం సిలబస్ కవర్ అవుతుంది. గ్రూప్స్కు సిద్ధమయ్యే అభ్యర్థులు కచ్చితంగా పాత ప్రశ్నా పత్రాలు సేకరించి ప్రాక్టీస్ చేయాలి. మన చుట్టూ ఉన్న అనేక అంశాల నుంచే ప్రశ్నలు ఇస్తారు. దేనినీ నిర్లక్ష్యం చేయొద్దు. రోజూ 10నుంచి 16 గంటలు ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం సొంతం అవుతుంది.
– బాలలత వల్లవరపు, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్
జాబ్ కొట్టాలనే కసి మరింత పెరిగింది
నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే నిర్వహించిన ఈ సదస్సులో నిపుణులు చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. జాబ్ కొట్టాలనే కసిని మరింత పెంచాయి. పోలీస్, గ్రూప్స్ కొలువులకు ఏ మెటీరియల్ తీసుకోవాలి, ప్లానింగ్ ఎలా ఉండాలనే అంశాలపై క్లారిటీ ఇచ్చారు. నిపుణలో సబ్జెక్టుల వారీగా ఇచ్చే అంశాలు బాగున్నాయి.
– సునీత, గూడూరు, మిర్యాలగూడ మండలం
ఉద్యోగం సాధిస్తాననే ధీమా వచ్చింది
పోటీ పరీక్షలకు నోటిఫికేషన్స్ వస్తున్నాయంటే చాలామందిలో తెలియని భయం ఉంటుంది. ఎలా ముందుకెళ్లాలనే తర్జన భర్జన పడుతుంటారు. ఇలాంటి సమయంలో ఉద్యోగార్థుల కోసం నమస్తే తెలంగాణ ఇలాంటి సదస్సు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. నిపుణుల మాటలు విన్నాక ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం వచ్చింది. ఎన్నో సందేహాలు, ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఎలా చదువాలో, ఏం చదువాలో చెప్పారు.
– స్వప్న, కురంపల్లి, కనగల్ మండలం
నిపుణను ఫాలో అవుతున్నా
నమస్తే తెలంగాణ నిపుణను కొంతకాలంగా ఫాలో అవుతున్నా. ఉద్యోగార్థులకు ఉపయోగకరమైన ఎన్నో అంశాలను ఇస్తున్నారు. ప్రత్యేకంగా జీకే, కరెంట్ అఫైర్స్, వివిధ సబ్జెక్టులకు సంబంధించిన సమాచారాన్ని చాలా విపులంగా అందిస్తున్నారు. అవగాహన సదస్సులో బాలలత మేడం సివిల్స్ ప్రిపేరేషన్కు సంబంధించి చెప్పిన మెటీరియల్, సూచనలు నోట్ చేసుకున్నా. వాటి ప్రకారం ప్రణాళికాబద్ధంగా చదువుతాం.
– గుండగోని శృతి, పానగల్, నల్లగొండ
టైం మేనేజ్మెంట్పై అవగాహన వచ్చింది
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం ముఖ్యం. పరీక్ష సమయం అందరికీ సమానంగా ఉన్నా కొందరే విజయం సాధిస్తారు. స్టడీ టెక్నిక్స్, చదువుకునే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలకు థ్యాంక్స్.
-చిర్ర మహేశ్, అంబారీపేట, శాలిగౌరారం మండలం
సందేహాలు నివృత్తి
విజయ్, దేవరకొండ : పోటీ పరీక్షలకు ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతున్నాను. ప్రణాళిక ఎలా ఉండాలి ?
బాలలత : అవసరమైన పుస్తకాలను సమకూర్చుకొని రోజూ కచ్చితంగా 10నుంచి 16గంటలు చదువాలి. సొంతంగా నోట్స్ సిద్ధం చేసుకోవాలి. జ్ఞాపకం ఉంచుకోవడం కోసం కనీసం రెండు నుంచి మూడు గంటలు బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. స్థూల ప్రణాళికలో నోటిఫికేషన్స్ రావడానికి ముందే కనీసం మూడు నెలలపాటు సమయం ఉండేలా చూసుకుని చదువాలి. మోడల్ టెస్ట్లు రాస్తూ సిద్ధం కావాలి.
షాహీనా, నల్లగొండ : చాలా సమయం చదివితే షుగర్ వస్తుంది అంటారు. వాస్తవమేనా ?
సీఎస్ వేప : అవాస్తవం. యువత అలాంటి ఆలోచనలు మర్చిపోవాలి. డయాబెటిస్ గురించి ఆలోచన వదిలి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడడానికి కావాల్సిన ప్రణాళికలు వేస్తూ ముందుకుసాగాలి. స్వీట్స్ కూడా తినొచ్చు. కానీ, ఎప్పటిలాగే. మోతాదు పెంచొద్దు.
తస్లీమా, నల్లగొండ : నాది సైన్స్ బ్యాక్గ్రౌండ్. సోషల్ సైన్స్ ఇబ్బందిగా ఉంది, ఏదైనా సలహా ఇవ్వగలరు.
బాలలత : ఇటీవల వెల్లడైన సివిల్స్ ఫలితాల్లో చాలామంది అభ్యర్థులు బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవారే. సైన్స్ స్టూడెంట్స్ సోషల్ అంశాలను ఈజీ చదవుగలరు. సొంతంగా నోట్స్ తయారుచేసుకుంటే చాలా సులభమవుతుంది.
సైదా , దామరచర్ల : మేడమ్.. నేను 80 కిలోమీటర్ల నుంచి మీ స్పీచ్ వినాలని వచ్చా? నేను బీఆర్ఏఓయూలో తెలుగు మీడియం స్టూడెంట్ను. సివిల్స్లో సకెస్స్ అవుతానా ?
బాలలత : సివిల్స్లో ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారే విజయం సాధిస్తారనేది వాస్తవం కాదు. తెలుగు మీడియంలో చదివిన వారూ మంచి ర్యాంకులు పొందారు. ముందు మీలోని నెగెటివ్ థాట్ను పక్కనపెట్టి ప్రణాళికతో చదువండి. సివిల్స్ ప్రిలిమ్స్లో విజయం సాధించి వస్తే మెయిన్స్కు సిద్ధం చేసి ఉద్యోగం సాధించే బాధ్యత నేను తీసుకుంటా.