సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) ;నగరవాసులు సాహితీవనంలో విహరించారు. కావాల్సినంత జ్ఞానాన్ని పోగేసుకున్నారు. మూడో రోజూ శనివారం సైతం బుక్ఫెయిర్కు అపూర్వ స్పందన లభించింది. పిల్లలు, పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావడంతో స్టాళ్లు కళకళలాడాయి. అలిశెట్టి ప్రభాకర్ వేదికపై పుస్తక సమీక్షలు ఆలోచింపజేశాయి. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా పాఠకులకు మొక్కలను పంపిణీ చేశారు. పుస్తక ప్రదర్శనలో మనముఖ్యమంత్రి స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మన ముఖ్యమంత్రి స్టాల్
మన ముఖ్యమంత్రి స్టాల్ను పర్యావరణవేత్త వేదకుమార్, బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు ఉద్యమ ప్రస్థానం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై అనేక పుస్తకాలను ఔత్సాహికులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కొనుగోలు చేశారు. జూలూరు గౌరీశంకర్ రాసిన జీవధార, తెలంగాణ విజయగాథ, ఆత్మబంధువు, ఒకగానొకడు పుస్తకాలు ఉన్నాయి. పెద్దూరి వెంకట దాసు రచించిన తెలంగాణ కేసరి, కన్నోజు మనోహరా చారి రచించిన తెలంగాణ అభ్యుదయం దేశానికి మహోదయం, మనోహర చిమ్మని రచించిన కేసీఆర్ ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్, త్రినేత్రి దటీజ్ కేసీఆర్ బుక్స్ పుస్తక ప్రియులు, విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో పాటు ఉద్యమ ప్రస్థానం, పాలన, ప్రభుత్వ పథకాలు పుస్తకాలూ అందుబాటులో ఉన్నాయి.
మొకల పంపిణీ..
బుక్ ఫెయిర్లో మొకల పంపిణీ కార్యక్రమాన్ని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ప్రముఖ పర్యావరణవేత్త వేదకుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఎంపీ సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో పుస్తక ప్రియులకు మొక్కలను అందజేశారు.
తెలంగాణ బుక్ ట్రస్ట్ …
తెలంగాణ బుక్ ట్రస్ట్ స్టాల్ను ప్రముఖ పర్యావరణవేత్త వేదకుమార్, బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాహిత్యం, రచనలు, కథల వంటి తెలంగాణ చరిత్ర, భౌగోళిక అంశాలకు సంబంధించిన పుస్తకాలు తెలంగాణ బుక్ ట్రస్ట్లో లభించడం సంతోషకరమని వేదకుమార్ అన్నారు. తెలంగాణ అస్తిత్వంపై పుస్తకాలు రాయడం సంతోషకరమన్నారు. గౌరీశంకర్ మాట్లాడుతూ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు చంద్రమోహన్ ఆధ్వర్యంలో అనేక సాహిత్య పుస్తకాలు ప్రచురించడం అభినందనీయమన్నారు.
నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే స్టాల్స్ 200-201
నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే స్టాల్ను తెలంగాణ పబ్లికేషన్స్
వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి, బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్,
ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్రావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వీపీ చిరంజీవి మాట్లాడుతూ ఈ తరం యువత కూడా సాహిత్యాన్ని చదవడం, రాయడం చాలా సంతోషకరమన్నారు. ఏటా బుక్ఫెయిర్ను నిర్వహిస్తూ.. అక్షర యజ్ఞం చేస్తున్నారంటూ..
గౌరీశంకర్ను అభినందించారు. కార్యక్రమంలో సర్క్యులేషన్
డీజీఎం రాంరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ సుధాకర్ పాల్గొన్నారు.
ఆధిపత్యానికి లోను కావొద్దు
చిక్కడపల్లి: తెలుగు భాష, సాహిత్యాల స్థితిగతులు, ఇతర భాషలను స్వీకరిస్తూనే ఆయా భాషల ఆధిపత్యానికి లోను కావొద్దని, ఆధిపత్యం హద్దు మీరినప్పుడు ఉద్యమాలు పుట్టుకొస్తాయని వక్తలు అన్నారు. తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘తెలుగుభాష- ఆధిపత్యాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి , ప్రముఖ భాషావేత్త భాస్కర్, ఆచార్య చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నవలలు ఆవిష్కరణ
అక్షరమూర్తి ప్రొఫెసర్ రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి అలిశెట్టి ప్రభాకర్ వేదికపై మార్పు గ్రామ ప్రకాశం-1, మార్పు ప్రగతి-2 ప్రస్థానం నవలలను ఆవిష్కరించారు. నవ తెలంగాణ ఫీచర్స్ ఎడిటర్ ఆనందాచారి పుస్తక పరిచయం చేశారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎస్.గోపాలరావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జూలూరు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
చర్చాగోష్టి..
‘ఒదిగిన కాలం’ డాక్టర్ నోరి దత్తాత్రేయుడుతో జూలూరి గౌరీశంకర్ ముఖాముఖీ చర్చాగోష్టి నిర్వహించారు. తన స్వీయ చరిత్రనే ఒదిగిన కాలంగా పుస్తకాన్ని తీసుకువచ్చినట్లు రచయిత దత్తాత్రేయుడు తెలిపారు. యూనిక్ థింకింగ్ పుస్తక పరిచయంలో రచయిత శ్రీలేఖ మాట్లాడుతూ ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందని, నాయకత్వ లక్షణాలు పెంపొందాలంటే యూనిక్ థింకింగ్ చేయాలని సూచించారు. బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ పాల్గొన్నారు.
‘బైండ్ల సెంద్రయ్య’పుస్తకావిష్కరణ
చిక్కడపల్లి, డిసెంబర్ 24: ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జిలుకర శ్రీనివాస్ రచించిన ‘బైండ్ల సెంద్రయ్య కథలు’ పుస్తకావిష్కరణ సభ శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ గంటా చక్రపాణి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కవి ప్రభాకర్, సీనియర్ జర్నలిస్టు కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.