Hyderabad | బంజారాహిల్స్,మార్చి 2: షేక్పేట మండల పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నం. 70లో సుమారు 200 కోట్ల విలువైన స్థలం ఆక్రమణలపై ‘నమస్తే తెలంగాణ’ లో శనివారం ‘ప్రభుత్వ భూమి కబ్జా’ పేరుతో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. ఖరీదైన స్థలంలో ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించడంతో పాటు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీకి, అశ్వినీ లే అవుట్కు మధ్య పాలపిట్ట జంక్షన్కు ఎడమ వైపున షేక్పేట మండల సర్వే నంబర్ 403/పీలోని టీఎస్ నెం-1, బ్లాక్ ఎఫ్, వార్డు -9లో సుమారు 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది.
2000లో ఈ స్థలాన్ని డాట్ పబ్లికేషన్స్ అనే సంస్థకు కేటాయించగా, నిర్ణీత సమయంలో దాన్ని వినియోగించుకోలేదు. దీంతో 2004 తర్వాత అప్పటి ప్రభుత్వం వెనక్కి తీసుకుని ల్యాండ్బ్యాంక్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ స్థలాన్ని వెనక్కి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ డాట్ పబ్లికేషన్స్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, పదేండ్లుగా పెండింగ్లో ఉంది. కాగా, ఈ స్థలంపై కన్నేసిన కొందరు వ్యక్తులు వేరే సర్వేనంబర్కు సంబంధించిన పత్రాలను తీసుకొచ్చి తాము ప్లాట్లు కొన్నట్లు నమ్మిస్తూ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని ‘నమసే’్త బయటపెట్టింది. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ సిబ్బంది ఆక్రమణలను తొలగించడంతో పాటు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.