మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బడంగ్పేట/పహాడీషరీఫ్, ఏప్రిల్ 7: ముంపు సమస్య తలెత్తకుండా వర్షాకాలం రాకముందే నాలా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె తన కార్యాలయంలో బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లు, జల్పల్లి మున్సిపాలిటీలో చేపట్టిన ఎస్ఎన్డీపీ పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా స్థానికులు ఎదుర్కొన్న ఇబ్బందులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
దీంతో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 64 కోట్లతో 7 చోట్ల నాలా అభివృద్ధి పనులు, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 23 కోట్లతో రెండు చోట్ల నాలా అభివృద్ధి పనులు, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ. 10.5 కోట్లతో ఒక చోట నాలా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఇందుకు సంబంధించి 6 పనులకు గాను టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులను ప్రారంభించారన్నారు. మిగతా పనులకు కూడా వెంటనే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయితే వర్షాకాలంలో ముంపు సమస్య ఉండదని అన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్ఎన్డీపీ సూపరింటెండెంట్ ఇంజినీర్ భాస్కర్రెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్ఈ హైదర్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కృష్ణయ్య, అనురాధ, బాలాపూర్ మండల తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, కమిషనర్లు కృష్ణమోహన్రెడ్డి, నాగేశ్వర్రావు, జీపీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.