సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): నగరంలో వాయు కాలుష్యం తీవ్రత తగ్గాలన్నా..? వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలన్నా..? రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండాలన్నా..? ప్రజా రవాణా వ్యవస్థలే అంతిమ పరిష్కారం. ఒకే చోట అనుకూల, వేగవంతమైన బహుళ ప్రజా రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యం. ఆర్టీసీ బస్సులు, రైల్వే, మెట్రో రైలు… ఇలా మూడు ప్రజా రవాణా వ్యవస్థలను ఒకే చోటు నుంచి నగర ప్రజలు వినియోగించుకొనే అవకాశం కల్పించనున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో కొత్తగా ప్రతిపాదించిన 5 మెట్రో మార్గాల్లో మెరుగైన ప్రజా వ్యవస్థను అందుబాటులోకి తీసుకుచ్చేందుకు చర్యలు చేపట్టింది.
నగరానికి తూర్పు దిక్కు ఉన్న నాగోల్తో పాటు దక్షిణాన ఉన్న రాజేంద్రనగర్, ఆరాంఘర్లను కలుపుతూ కొత్తగా ప్రతిపాదించిన 19 కి.మీ మెట్రో మార్గంలో 3 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులు, ఆర్టీసీ, రైల్వే స్టేషన్ను కలిపేందుకు ఉన్న అవకాశాలను మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో గుర్తించారు. ముఖ్యంగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఆరాంఘర్, బుద్వేల్ వద్ద రైల్వే స్టేషన్లతో లింకు కలుపడం ద్వారా ఎక్కువ మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది.
అలాగే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్ వద్ద, హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఆరాంఘర్ వద్ద.. మెట్రో స్టేషన్లు నిర్మిస్తే ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుంది. నగరం నుంచి నాగార్జున సాగర్ హైవేలో రాకపోకలు సాగించే వారికి సాగర్ రింగు రోడ్డు వద్ద మెట్రో స్టేషన్ అవసరమని, కావాల్సినంత స్థలాన్ని సేకరించేందుకు ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుందని మెట్రో అధికారి తెలిపారు.
నాగోల్-ఎల్బీనగర్-మైలార్దేవ్పల్లి-ఎయిర్పోర్టు లైన్లో ఉన్న చాంద్రాయణగుట్ట వరకు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా మీదుగా వచ్చే మెట్రో మార్గాన్ని మరో ఒకటిన్నర మీటరు మేర చాంద్రాయణగుట్ట వరకు పొడిగించి, పాతబస్తీకి ఎయిర్పోర్టుకు మెట్రో కనెక్టివిటీ కల్పించి ఇంటర్చేంజ్ స్టేషన్గా చాంద్రాయణగుట్టను పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేయాలని మెట్రోఎండీ ఎన్వీఎస్ రెడ్డి సూచనలు చేశారు.
రెండు వైపుల నుంచే మెట్రో మార్గాలు చాంద్రాయణ గుట్ట చౌరస్తాలో కలపాలంటే ఇప్పటికే అక్కడ ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జీ ప్రధాన అడ్డుగా ఉందని గుర్తించారు. కొన్ని మీటర్ల దూరం ముందుకు తీసుకువెళ్లి ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్ను నిర్మిస్తే శ్రీశైలం హైవే, చార్మినార్, ఫలక్నుమా నుంచి వచ్చే వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
1. మియాపూర్-చందానగర్- బీహెచ్ఈఎల్- పటాన్చెరు (14 కి.మీ)
2. ఎంజీబీఎస్-ఫలక్నుమా- చాంద్రాయణగుట్ట-మైలార్దేవ్ పల్లి-పీ7 రోడ్డు- ఎయిర్పోర్టు (23 కి.మీ).
3. నాగోల్-ఎల్బీనగర్ మీదుగా చాంద్రాయణగుట్ట-మైలార్దేవ్ పల్లి-ఆరాంఘర్- రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్కన కొత్తగా నిర్మించే రాష్ట్ర హైకోర్టు స్థలం వరకు (19 కి.మీ).
4. మెట్రో కారిడార్-3ని పొడిగిస్తూ రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్లోని విప్రో సర్కిల్ వరకు (12 కి.మీ)
5. ఎల్బీనగర్-వనస్థలిపురం- హయత్నగర్ వరకు (8 కి.మీ)
మహానగరం నుంచి దక్షిణ భారత దేశం వెళ్లే రైళ్లు ఎక్కువగా ఫలక్నుమా-బుద్వేల్ మీదుగా బెంగళూరు,తిరుపతి, కేరళ వంటి ప్రాంతాలకు వెళుతుంటాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రైల్వే ప్రయాణికులు బుద్వేల్ రైల్వే స్టేషన్లో దిగి, దానికి ఎదురుగా నిర్మించే హైకోర్టు మెట్రో స్టేషన్కు చేరుకునేందుకు కేవలం 200 మీటర్ల దూరమే ఉంది.
రాజేంద్రనగర్ వ్యవసాయం విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారిని ఇప్పటికే 6 లేన్ల ఎక్స్ప్రెస్వేగా నిర్మించడంతో మెట్రో స్టేషన్ నిర్మాణానికి భూసేకరణ సమస్య ఉందని అధికారులు సర్వేలో గుర్తించారు. బుద్వేల్ నుంచి ఆరాంఘర్ వెళ్లే మార్గం 2 కి.మీ లోపే ఉండటంతో పాటు శివరాంపల్లి ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ సైతం సమీపంలోనే ఉంది. ఒకే చోట ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా ఉందని మెట్రో అధికారులు సర్వేలో గుర్తించారు.
ఎయిర్పోర్టుకు మెట్రో రైలు కనెక్టివిటీలో భాగంగా మైలార్దేవ్పల్లి వద్ద రెండు మెట్రో మార్గాలు వస్తుండటంతో ఇక్కడ మరో ఇంటర్చేంజ్ స్టేషన్ను నిర్మించాల్సి ఉంటుందని మెట్రో అధికారులు గుర్తించారు. నాగోల్ నుంచి, ఫలక్నుమా వైపుల నుంచి వచ్చే మెట్రో రైళ్లు మొదట చాంద్రాయణగుట్ట వద్ద కలిసి అక్కడి నుంచి మైలార్దేవ్ పల్లికి వచ్చిన తర్వాత ఒక మార్గం ఎయిర్పోర్టు లోపలికి, రెండో మార్గంలో ఆరాంఘర్ మీదుగా కొత్త హైకోర్టు వరకు వెళుతుంది.
ఫలక్నుమా నుంచి వచ్చే రైల్వే మార్గం ఈ మెట్రో స్టేషన్కు సమీపంలోనే ఉండటంతో భవిష్యత్తులో ఇక్కడ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ను నిర్మించవచ్చని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. ఇలా క్షేత్ర స్థాయిలో మెట్రో రూట్లలో కీలకమైన ప్రాంతాలు, రోడ్డు, రైలు మార్గాలను మెట్రోతో అనుసంధానం చేసే అంశాలను ప్రత్యేకంగా గుర్తించి నివేదికను రూపొందిస్తున్నారు.