Hyderabad | హైదరాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): మాంసం ప్రియుల కోసం హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్ అందుబాటులోకి రానున్నది. మాసబ్ట్యాంక్లోని పశుసంవర్ధక కార్యాలయ సమీపంలో షీప్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే క్యాంటీన్ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 11 లేదా 12న పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దీనిని ప్రారంభించనున్నారు.
పనుల పురోగతిని షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని మటన్ ప్రియులకు నాణ్యమైన మటన్ బిర్యానీని అందించాలనే ఉద్దేశంతో ఈ క్యాంటీన్ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. తర్వాత దశలవారీగా నగరంలోని పలు ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేసేందుకు ఫెడరేషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే మత్స్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫిష్ క్యాంటీన్కు మంచి ఆదరణ లభిస్తున్నది. నాణ్యమైన, రుచికరమైన మటన్ వంటకాలనూ ఈ క్యాంటీన్లో అందించనున్నారు.