సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు దిశ-దశ లేకపోవడంతో ఏ ప్రాంతంలో ఏ నిర్మాణానికి నోటీసులు వస్తాయో… ఏ సామాన్యుడి ఇంటికి రెడ్మార్కు పడుతుందో… ఏ అపార్టుమెంట్ వైపు బుల్డోజర్ దూసుకువస్తుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నరేండ్ల కిందట మొదలైన ఈ మూసీ సుందరీకరణ ప్రస్థానంలో రెండు సంవత్సరాల కిందటే చాదర్ఘాట్ పరిధిలో వందలాది నిరుపేదల ఇండ్లు నేలమట్టమయ్యాయి. దీంతో మలక్పేట, అంబర్పేట, నాంపల్లి, కార్వాన్, రాజేంద్రనగర్ ఇలా మూసీ పరీవాహకంలోని ఇండ్లన్నీంటికీ రెడ్మార్కులు పెట్టి కూల్చివేతలు చేపడతారని అందరూ భయపడ్డారు.
కానీ ప్రభుత్వం కొన్ని నెలల పాటు విరామం ఇచ్చి చివరకు కొన్నిరోజుల కిందట నుంచి రోడ్మ్యాప్ను మార్చి గాంధీ సరోవర్ ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చింది. సుందరీకరణ ప్రాజెక్టును ఐదు దశల్లో చేపడతామంటూ మొదటి దశ కింద సరోవర్ ప్రాజెక్టును చేర్చింది. మరి ప్రభుత్వ ఆలోచన ఈ రీతిలో ఉంటే చాదర్ఘాట్ పరిధిలో రెండేండ్ల కిందట పేదోళ్ల ఇండ్లను ఎందుకు కూల్చారు? అనే ప్రశ్నకు ఇప్పటికీ సర్కారు నుంచి సమాధానం లేదు. ఇదిలాఉంటే తాజాగా తెరపైకి తీసుకువచ్చిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుతో ఇప్పుడు జంట జలాశయాల దిగువన ప్రాంతాలతో పాటు అక్కడి నుంచి బాపూఘాట్ వరకు మూసీ పరివాహకంలో ఉన్న ప్రజల కంటి మీద కునుకు కరువైంది.
మూసీ సుందరీకరణ జంట జలాశయాల దిగువ ప్రాంతం సహా పరీవాహక ప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నది. ప్రస్తుతానికి మూసీ సుందరీకరణలో భాగంగా తాజాగా చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు (ఫేజ్-1) ప్రాథమిక అడుగులు మాత్రమే వేసింది. ఇందులో భాగంగా హిమాయత్సాగర్ జలాశయం దిగువ ప్రాంతం (డౌన్ స్ట్రీమ్)లో 500 మీటర్ల నిషేధిత జోన్ అమలుతో పాటు ఈసాకు రెండు వైపులా 50 మీటర్ల బఫర్జోన్ మీద ఎంఆర్డీసీఎల్ అధికారులు దృష్టి సారించారు.
ఈ మేరకు ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి… రైతులు, నిర్మాణ యజమానులకు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం ఆ ప్రాంత భూముల సర్వేనంబర్లన్నింటినీ నిషేధిత జాబితాలోకి ఎక్కించింది. దీంతో ఇక మరో అడుగు గాంధీ సరోవర్ ఫేజ్-1బి కింద గండిపేట వద్ద పడనున్నది. అంటే గండిపేట (ఉస్మాన్సాగర్) జలాశయం దిగువ ప్రాంతం(డౌన్స్ట్రీమ్)లో కూడా 500 మీటర్ల నిషేధిత జోన్ అమలు చేయడం అనివార్యంగా కనిపిస్తున్నది. ఇదే జరిగితే…గండిపేట గ్రామంలో చాలా భాగంతో పాటు ఆ రిజర్వాయర్ దిగువ ప్రాంతంలో అర కిలోమీటరు దూరంలోని వేలాది నిర్మాణాలకూ గండం పొంచి ఉన్నట్లు స్పష్టమవుతున్నది.
ముఖ్యంగా హిమాయత్సాగర్ డౌన్ స్ట్రీమ్లో వందలాది నిర్మాణాలున్నప్పటికీ ఖాళీ భూములు ఎక్కువగా ఉండగా అందుకు భిన్నంగా గండిపేట డౌన్స్ట్రీమ్లో మాత్రం ఖాళీ భూములు తక్కువగా ఉండి, నిర్మాణాలు పుట్టగొడుగుల్లా ఉన్నాయి. 500 మీటర్ల జోన్లో బడా బాబుల ఆకాశహర్మ్యాలే కాకుండా పలు ఫాంహౌజ్లు, కన్వెన్షన్ హాల్స్, విద్యా సంస్థల నిర్మాణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు నిర్ణయించిన దరిమిలా త్వరలో వీరందరికీ నోటీసులు రానున్నాయా? అనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
బఫర్జోన్ల అమలుతో సర్కారు ముందుకు…మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా రెండు నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టిసారించింది. అందులో ఒకటి బఫర్జోన్. జీవో 168 ప్రకారం ఈ బఫర్ను ప్రామాణికంగా తీసుకున్నామని ఎంఆర్డీసీఎల్ అధికారులు చెబుతున్నారు. జీవో 168లో పట్టణ పరిధిలో నదికి బఫర్ను 30 మీటర్లుగా నిర్ధారించినప్పటికీ… దానికి సవరణగా 2016లో వచ్చిన జీవో-7లో బఫర్ పరిధిని 50 మీటర్లుగా పెంచారని అంటున్నారు.
దానిని తాము ఇప్పుడు ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు స్పష్టం చేస్తున్నారు. అందుకే మధు పార్కు రిడ్జ్ అపార్టుమెంట్ను కూల్చివేశామని అంటున్నారు. ఇక రెండోది… 500 మీటర్ల నిషేధిత జోన్. 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గండిపేట, హిమాయత్సాగర్ జంట జలాశయాల పరిరక్షణకు ఒక నిపుణుల కమిటీని వేసింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు 2007లో పురపాలక శాఖ ప్రత్యేకంగా కొన్ని కఠినమైన మార్గదర్శకాలతో మెమో (నెం.261/ఐ1/2006, తేది: 16.7.2007) జారీ చేసింది. అందులోనే 500 మీటర్ల నిషేధిత జోన్ను పొందుపరిచారు.
రెండు జలాశయాల డౌన్స్ట్రీమ్లో 500 మీటర్లు అంటే అర కిలోమీటరు వరకు ఈ నిషేధిత జోన్ను అమలు చేయాలని, ఒక్కటంటే ఒక్క నిర్మాణాన్ని అనుమతించవద్దని స్పష్టం చేశారు. అదే విధంగా డౌన్స్ట్రీమ్లో 500 మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు కిలోమీటరు కేవలం నివాసాలను అందునా జీ+2 అంతస్తుల వరకు మాత్రమే అనుమతించాలని చెప్పారు. కిలోమీటరు దాటిన తర్వాత పది కిలోమీటర్ల వరకు 68 రకాల పరిశ్రమలు (క్రషర్లతో సహా) కూడా అనుమతులు ఇవ్వద్దని స్పష్టం చేశారు. ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆ మెమో ఆధారంగానే జలాశయాల డౌన్స్ట్రీమ్లో 500 మీటర్ల నిషేధిత జోన్ అమలు చేస్తుంది.
రేవంత్రెడ్డి ప్రభుత్వం మూసీ ఫేజ్-1లో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టును తొలుత పూర్తి చేస్తామంటుంది. ఈ మేరకు ఫేజ్-1లో ’1ఏ’ కింద హిమాయత్సాగర్ రిజర్వాయర్ నుంచి బాపుఘాట్ వరకు 11.2 కిలోమీటర్లు… 1బీ కింద గండిపేట నుంచి బాపూఘాట్ వరకు 9.8 కిలోమీటర్లు అంటే మొత్తంగా 21 కిలోమీటర్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ఫేజ్-1ఎలో భాగంగా హిమాయత్సాగర్ జలాశయం దిగువన 500 మీటర్ల నిషేధిత జోన్… ఈసాకు రెండువైపులా 50 మీటర్ల బఫర్జోన్ను ప్రామాణికంగా తీసుకున్నారు.
అందులో కేవలం ఉత్తరం వైపు ఉన్న భూములు, నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగానే మధుపార్కు రిడ్జ్ అపార్టుమెంటు మొదలు హిమాయత్సాగర్ గ్రామం వరకు ఉన్న అనేక సర్వేనెంబర్లతో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. కొంతమందికి నేరుగా నోటీసులు కూడా జారీ చేశారు. హిమాయత్సాగర్ డౌన్స్ట్రీమ్లో ఈసాకు దక్షిణ వైపున కూడా పలు గోడౌన్లు, కన్వన్షన్ సెంటర్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. కానీ ఆ సర్వే నంబర్లు మాత్రం ఎంఆర్డీసీఎల్ జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్లో లేవు. కనీసం వారికి నోటీసులు ఇచ్చారా? లేదా? అనేది కూడా తేలడం లేదు.
ఎంఆర్డీసీఎల్ అధికారులు ఫేజ్-1బీ కింద గండిపేట జలాశయం నుంచి దిగువన బాపూఘట్ వరకు 9.8 కిలోమీటర్ల అభివృద్ధిని చేపట్టనున్నారు. అంటే గండిపేట (ఉస్మాన్సాగర్) జలాశయం డౌన్స్ట్రీమ్లో 500 మీటర్ల నిషేధిత జోన్తో పాటు గండిపేట-బాపూఘాట్ వరకు మూసీ నదికి రెండువైపులా 50 మీటర్ల బఫర్జోన్ను నిర్ధారించనున్నారు. ఈ క్రమంలో బాపూఘాట్ నుంచి తారామతి వరకు రక్షణ శాఖ భూములు ఉన్నాయి. అక్కడి నుంచి ప్రజల నిర్మాణాలు మొదలయ్యాయి. అయితే ఈసాతో పోలిస్తే మూసీకి రెండువైపులా నిర్మాణాలు భారీగానే కనిపిస్తున్నాయి.
ఇదంతా ఒక ఎత్తయితే… గండిపేట జలాశయం డౌన్స్ట్రీమ్లో 500 మీటర్ల పరిధిని పరిశీలిస్తే మాత్రం నిర్మాణాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇందులో గండిపేట గ్రామంలోని పోస్టాఫీసు కూడా కనిపిస్తున్నది. ఇక భారీ అపార్టుమెంట్లు, విద్యా సంస్థల భవనాలు, ఫాంహౌజ్లు, కన్వన్షన్ హాల్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. అంటే ఫేజ్-1ఎలో నిబంధనలు అమలు చేస్తున్నందున తర్వాత ఫేజ్-1బీలో అవే అమలు చేయాల్సి ఉన్నందున ఎంఆర్డీసీఎల్ వీటన్నింటికీ నోటీసులు ఇస్తే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం కానున్నది.