సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జంట జలాశయాలైన గండిపేట (ఉస్మాన్సాగర్), హిమాయత్సాగర్ల కింద నుంచి ప్రారంభమయ్యే మూసీ, ఈసా నదుల తీర ప్రాంతాన్ని పరిరక్షిస్తూ చేపట్టిన మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా రిటైయినింగ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
హైదరాబాద్ మహానగరానికి ఒక చివర నుంచి మరో చివరి వరకు పారుతున్న మూసీ నదికి ఇరువైపులా రీటైయినింగ్ వాల్ నిర్మిస్తే..భవిష్యత్లో కబ్జాలను అడ్డుకోవడంతో పాటు మూసీ నదిలో వచ్చే వరద బయటకు రాకుండా ఉంటుంది. ఇందులో భాగంగానే నగరానికి పడమర దిక్కున ఉన్న గండిపేట, హిమాయత్సాగర్ కింది భాగాల నుంచి మొదలు కొని తూర్పు వైపు ఉన్న గౌరెల్లి ఔటర్ రింగు రోడ్డు వరకు సుమారు 55 కి.మీ మేర మూసీ నది వెంబడి అవసరమైన చోట రీటెయినింగ్ వాల్ నిర్మించనున్నారు.
ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) రూపొందించే పనులను కన్సల్టెంట్లకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) అప్పగించింది. దీని రూపకల్పన చేసే సంస్థలకు ఈ రంగంలో అనుభవం ఉన్న వారిని ఎంపిక చేసి, బాధ్యతలు అప్పగించనున్నది. ఎంపిక బాధ్యతను ప్రభుత్వం తరపున ఏర్పాటైన ఎంఆర్డీసీఎల్ అధికారులు చేపట్టారు. 15 ఏండ్లలో నదులు, ఉపనదులు, ప్రవాహాలు, కాలువలు, బ్యారేజీలు ఉన్న ప్రాజెక్టుల్లో భాగంగా రిటెయినింగ్ వాల్స్ నిర్మాణం కోసం రూపొందించిన డీపీఆర్లను విజయవంతంగా పూర్తి చేసిన అనుభవం ఉన్న వారినే ఎంపిక చేయనున్నారు.