బంజారాహిల్స్, డిసెంబర్ 8 : తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేదన్న కోపంతో ఓ వ్యక్తితో పాటు అతడి భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం… ఫిలింనగర్ పీఎస్ పరిధిలోని సత్యాకాలనీ పయోనీర్ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న సయ్యద్ అహ్మద్ ఖాద్రీ (42) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతడికి 2014లో సయీదా మిరాజ్ ఫాతిమా (40)తో వివాహమైంది. రెండేండ్ల క్రితం మేకల వ్యాపారం కోసం నదీం కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తివద్ద అహ్మద్ ఖాద్రీ సుమారు 20లక్షలు అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వాలంటూ పలుమార్లు ఖాద్రీ ఇంటికి వచ్చి వారు నిలదీశారు. అయితే తమకు డబ్బులు రావాల్సి ఉందని, త్వరలోనే ఇస్తామంటూ ఫాతిమా సైతం చెబుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో గత నెల 28న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అహ్మద్ ఖాద్రీ తిరిగి రాలేదు. కాగా 29న రాత్రి సయీదా మిరాజ్ ఫాతిమాకు హుమాయున్నగర్లో నివాసం ఉంటున్న ఆమె అక్క మునీర్ ఫాతిమా పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఖాద్రీకి కాల్ చేయగా అతడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సత్యాకాలనీలోని మిరాజ్ ఫాతిమా ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉంది. ఇంట్లో నుంచి గ్యాస్ వాసన రావడంతో తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా బట్టల మూటల కింద మిరాజ్ ఫాతిమా మృతదేహం కనిపించింది. ఈ మేరకు మునీర్ ఫాతిమా గత నెల 30న ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిరాజ్ ఫాతిమా భర్త ఖాద్రీ ఆమెను హత్యచేసి పారిపోయి ఉంటాడని, గతంలో పలుమార్లు ఆమెకు పిల్లలు పుట్టడం లేదని వేధిస్తుండే వాడని మునీర్ ఫాతిమా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మిరాజ్ ఫాతిమా హత్య కేసులో దర్యాప్తు ప్రారంభించిన ఫిలింనగర్ పోలీసులు ఖాద్రీ కోసం గాలింపు చేపట్టగా షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఫాతిమా హత్యకు గురి కావడానికి ముందే ఆమె ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. సీసీ ఫుటేజీల ఆధారంగా… చేతిలో బిర్యానీ ప్యాకెట్తో వచ్చిన ముగ్గురు వ్యక్తుల గురించి ఆరా తీయగా ఫాతిమా భర్త ఖాద్రీకి అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా వారిలో ఉన్నాడు. దీంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. గత నెల 28న రాత్రి నదీమ్ కాలనీలో చెరువు వద్దకు ఖాద్రీని పిలిచిన దుండగులు అతడిని దారుణంగా హత్య చేయడంతో పాటు చెరువువద్ద గొయ్యి తీసి పాతిపెట్టారు. హత్య విషయం బయటకు రావద్దంటే ఖాద్రీ భార్య మిరాజ్ ఫాతిమాను కూడా చంపేయాలని ఆ ముగ్గురు వ్యక్తులు నిర్ణయించుకున్నారు. మిరాజ్ ఫాతిమా ఇంటికి వచ్చి ఆమెను చున్నీతో గొంతు బిగించి చంపేసి.. బట్టలమూట కింద శవాన్ని దాచిపెట్టి పారిపోయారు. నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకున్న ఫిలింనగర్ పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. హత్యకు గురైన ఖాద్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.